India record: భారత్ సరికొత్త చరిత్ర.. పాక్ రికార్డ్ బ్రేక్!
భారత్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. బిహార్లోని జగదీష్పూర్లో శనివారం ఒకేసారి 75,000 భారత జాతీయ జెండాలు ఎగరేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.
- Narender Thiru
- Published On : April 23, 2022 / 07:53 PM IST
India Record
India record: భారత్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. బిహార్లోని జగదీష్పూర్లో శనివారం ఒకేసారి 75,000 భారత జాతీయ జెండాలు ఎగరేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఈ విషయంలో పాకిస్తాన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టేసింది. 1857 సిపాయిల తిరుగుబాటులో మరణించిన భారత విప్లవ కారుడు వీర్ కన్వర్ సింగ్ 164వ వర్ధంతి కార్యక్రమం బిహార్, భోజ్పూర్ జిల్లా, జగదీష్పూర్లో జరిగింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ హాజరయ్యారు.
India Covid-19 : దేశంలో కొవిడ్ నాల్గో వేవ్ ముప్పు.. వరుసగా 4వరోజు పెరిగిన కరోనా కేసులు
ఈ కార్యక్రమానికి 77 వేల మంది వరకు పౌరులు హాజరయ్యారు. వీరంతా వందేమాతరం ఆలపించారు. ఈ సందర్భంగా అందరూ జాతీయ పతాకాన్ని చేబూని, జెండా గాలిలో ఊపుతూ నినాదాలు చేశారు. ఇలా ఒకేసారి 75,000 మందికి పైగా పౌరులు జాతీయ పతాకాన్ని చేత్తో ఎగరేయడం ఇదే మొదటిసారి. దీంతో ఈ కార్యక్రమానికి ప్రపంచ రికార్డు దక్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ ప్రతినిధులు కూడా దీనికి హాజరై, ఈ రికార్డు నమోదు చేశారు. ఇంతుకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉండేది. లాహోర్ పట్టణంలో పద్దెనిమిదేళ్ల క్రితం 56,000 మందితో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడా రికార్డు భారత్ సొంతం.
