PAN-Aadhaar Link : పాన్-ఆధార్ లింక్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే?
మీ పాన్-ఆధార్ కార్డు లింక్ చేసుకున్నారా? లేదంటే.. మీ పాన్ ఇక చెల్లదట.. ఇప్పటికే పాన్ ఆధార్ లింక్ గడువు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ తేదీ లోపు మీ పాన్-ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది..
- kunduru Vinod
- Published On : June 26, 2021 / 04:50 PM IST
Pan Aadhaar Link
PAN – Aadhaar Link: పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గత రెండుళ్లుగా ప్రజలను కోరుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అనేక సార్లు గడువు పొడిగించింది. మార్చి 31తో పాన్ ఆధార్ లింగ్ గడువు ముగియడంతో ఆదాయపు పన్ను శాఖ జూన్ 30 వరకు పొడిగించింది. ఇక జూన్ 30 సమీపిస్తున్నా చాలామంది ఇంకా లింక్ చేసుకోలేదు. దీంతో మరోసారి గడువు పెంచింది ఆదాయపు పన్ను శాఖ. సెప్టెంబర్ 30 వరకు పాన్ – ఆధార్ లింక్ గడువు పెంచింది.
ఈ విషయాన్నీ కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ లో తెలిపారు. కరోనా కారణంగా చాలామంది పాన్ – ఆధార్ లింక్ చేసుకోలేదని వారిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాగా గత ఉత్తర్వుల ప్రకారం జూన్ 30 వరకు పాన్ – ఆధార్ లింక్ చేయని వారికి రూ. 1000 జరిమానా విధిస్తామని, పాన్ కార్డు పనికిరాదని తెలిపారు. ఇక తాజాగా గడువును మరోసారి పెంచారు.
కాగా సెక్షన్ 139 ఏఏ ప్రకారం ప్రతి పౌరుడు తమ ఆదాయ వివరాల సమర్పణ పత్రంలోనూ, పాన్ కార్డు దరఖాస్తులోనూ ఆధార్ నెంబరు పొందపరచడం తప్పనిసరి. ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు సెప్టెంబరు 30 తర్వాత చెల్లుబాటు కావని కేంద్రం వివరించింది.
