Vitthal Rukmini Amma : అమ్మవారికి అలకరించిన మామిడి పండ్లు కరోనా బాధితులకు పంపిణీ
రుక్మిణీ దేవీ దేవాలయాన్ని మామిడి పండ్లతో అలంకరించారు. ఈ పండ్లను ఆలయ నిర్వాహకులు కరోనా బాధితుల కోసం పంపిణీ చేశారు.
- nagamani
- Published On : May 17, 2021 / 11:19 AM IST
Vitthal Rukmini Temple Adorned With Mangoes
Vitthal Rukmini Temple adorned with mangoes : మహారాష్ట్రలోని పండర్పూర్లోగల విఠల్- రుక్మిణి ఆలయంలో అక్షయ తృతీయ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత శుక్రవారం ( మే 14,2021) నిర్వహించిన ఈ వేడుకలు అంగరంగ వైభోగంగా జరిగాయి. ఓ వ్యాపారవేత్త అమ్మవారికి ఇచ్చిన మామిడి పండ్లతో అక్షయ తృతీయ వేడుకల సందర్బంగా రుక్మిణి అమ్మవారితో సహాయ మొత్తం ఆలయాన్ని అలంకరించారు. ఏడు వేల మామిడిపండ్లతో దేవాలయాన్ని సుందరంగా అలంకరించారు.
మహారాష్ట్రలో కోవిడ్ వ్యాపిస్తున్న తరుణంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఆలయంలో అక్షయ తృతీయ వేడుకలు అర్చకులు నిర్వహించారు. పూణేకు చెందిన వినాయక్ కచ్చి అనే వ్యాపారవేత్త ఈ మామిడి పండ్లను ఆలయానికి సమర్పించగా.. ఈ వేడుకను నిర్వహించారు. మామిడి పండ్లతో అలంకరించిన ఈ ఆలయానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో లభించే అల్ఫోన్సో రకపు మామిడి పండ్లను ఆలయ అలంకరణ కోసం వినియోగించారు. అనంతరం ఈ మామిడి పండ్లను కరోనా బాధితులకు పంపిణీ చేయాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. దీంట్లో భాగంగానే..కరోనా బాధితులకు ఇమ్యూనిటీ కోసం అమ్మవారికి ఆలయాన్ని అలంకరించిన పండ్లను పంపిణీ చేశామని ఆలయ నిర్వహాకులు తెలిపారు. మామిడి పండ్లతో పాటు పుచ్చకాయలు..ఇంకా ఇతర పండ్లను కూడా పంపిణీ చేశామని తెలిపారు.
