Delhi2
Withdrawal Of AFSPA : నాగాలాండ్లో దశాబ్దాలుగా అమల్లో ఉన్న వివాదాస్పద “సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం-1958(AFSPA)”విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తివేసే అవకాశాలను పరిశీలించడానికి ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
నాగాలాండ్, అసోం ముఖ్యమంత్రులు నియో ఫియు రియో, హిమంత బిశ్వ శర్మతో.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిసెంబర్ 23న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో ఐదుగురు సభ్యులుగా ఉంటారని ఆదివారం నాగాలాండ్ సీఎం నియో ఫియు రియో తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రత్యేక అధికారాల చట్టంపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుందన్నారు. కాగా, కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి(ఈశాన్యరాష్ట్రాలు), సీఎస్, నాగాలాండ్ డీజీపీ, అసోం రైఫిల్స్ ఐజీ, సీఆర్పీఎఫ్ నుంచి ఓ ప్రతినిధి కమిటీ సభ్యులుగా ఉంటారు. 5 రోజుల్లోగా ప్యానెల్ తమ ప్రతిపాదనలు, సూచనలు సమర్పించాల్సి ఉంటుంది. కమిటీ సిఫార్సుల మేరకు చట్టాన్ని తొలగించాలా, వద్దా అనేదానిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది.
అయితే, నాగాలాండ్లో ఇటీవల సైన్యం జరిపిన కాల్పుల్లో 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత AFSPA చట్టాన్ని ఎత్తివేయాలని ఈశాన్య రాష్ట్రాల సీఎంల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా నాయకులు డిమాండ్ చేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలు,నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి.
ఈ చట్టం.. భద్రతా బలగాలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తుంది. దీని ప్రకారం..ఎలాంటి ముందస్తు వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్టు చేయవచ్చు.ఆపరేషన్లు నిర్వహించవచ్చు. బలగాలు ఎవరినైనా కాల్చి చంపినా.. వీరికి రక్షణ లభిస్తుంది. అయితే చాలా ఏళ్ల నుంచే ఈ వివాదాస్పద చట్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్లు ఉన్నప్పటికీ..ఇటీవల ఘటన తర్వాత ఈ డిమాండ్లు మరింత ఊపందుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కమిటీ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది.
ALSO READ Covid Positive: ఒకే స్కూళ్లో 52మందికి కొవిడ్ పాజిటివ్