Photojournalist Danish Siddiqui : ఫొటో జర్నలిస్ట్ సిద్ధిఖీ కాల్పుల్లో చనిపోలేదు.. తాలిబన్లే ఉరితీసి చంపేశారు!
అఫ్ఘనిస్తాన్లో భద్రతా దళాలకు, తాలిబన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భారత ఫొటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీ (Photojournalist Danish Siddiqui) మరణం వెనుక దాగిన రహస్యంపై అమెరికాకు చెందిన ఓ మ్యాగజైన్ అసలు వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది.
- Sreehari A
- Published On : July 30, 2021 / 10:25 AM IST
Photojournalist Danish Siddiqui Was Executed By Taliban
Photojournalist Danish Siddiqui : అఫ్ఘనిస్తాన్లో భద్రతా దళాలకు, తాలిబన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భారత ఫొటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీ (Photojournalist Danish Siddiqui) మరణం వెనుక దాగిన రహస్యంపై అమెరికాకు చెందిన ఓ మ్యాగజైన్ అసలు వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది. సిద్ధిఖీ సాధారణంగా కాల్పుల్లో చనిపోలేదని, దారుణ హత్యకు గురయ్యాడంటూ నివేదిక వెల్లడించింది. డానిష్ ఐడెంటిటీని గుర్తించిన తాలిబన్లు అతన్ని బంధించి హింసించి ఉరి తీసి చంపారని నివేదిక పేర్కొంది. 38ఏళ్ల సిద్ధిఖీపై కాల్పులు జరిపిన అనంతరం తాలిబన్లు అతన్ని ఉరితీసారంటూ అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇనిస్టిట్యూట్లో సీనియర్ ఫెలోగా మైఖేల్ రూబిన్ మ్యాగజైన్లో రాసుకొచ్చారు. ‘పులిట్జర్ బహుమతి విజేత డానీష్ సిద్దిఖీ (Spin Boldak) జిల్లాలోని కాందహార్ నగరంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అఫ్ఘన్ దళాలకు, తాలిబన్లకు మధ్య జరుగుతున్న ఘర్షణలను కవర్ చేస్తున్నాడు. ఆ సమయంలో డానీష్ తీవ్రంగా గాయపడ్డాడు.
వాషింగ్టన్ ఎగ్జామినర్ రిపోర్టు ప్రకారం..
పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో అఫ్ఘన్ దళాలు తాలిబాన్ల మధ్య ఘర్షణను కవర్ చేసేందుకు సిద్దిఖీ ఒక అఫ్ఘన్ నేషనల్ ఆర్మీ బృందంతో స్పిన్ బోల్డాక్ ప్రాంతానికి వెళ్లారు. అప్పుడు తాలిబాన్లు దాడి చేయడంతో కమాండర్ సిద్దిఖి నుంచి కొంతమంది విడిపోయారు. మరో ముగ్గురు అఫ్ఘన్ దళాల వద్ద ఉన్నారు. ఈ సమయంలో సిద్ధిఖికి గాయమైంది వెంటనే అతన్ని ఆర్మీ బృందం స్థానిక మసీదుకు తీసుకెళ్లారు. అక్కడే అతడికి ప్రథమ చికిత్స అందించారు. ఒక జర్నలిస్ట్ మసీదులో ఉన్నాడనే వార్త తెలిసి తాలిబాన్లు దాడి చేశారు.
మసీదులో ఉన్నాడని తెలిసి :
సిద్దిఖీ అక్కడ ఉన్నాడనే సమాచారంతోనే తాలిబాన్ మసీదుపై దాడి చేసినట్లు స్థానిక దర్యాప్తులో తేలిందని నివేదిక వెల్లడించింది. తాలిబాన్లు అతన్ని బంధించినప్పుడు సిద్దిఖీ బతికే ఉన్నాడు. తాలిబాన్లు సిద్దిఖీ గుర్తింపును ధృవీకరించారు. ఆ తరువాతే అతనితో పాటు బంధించిన వారిని ఉరితీశారు. అతన్ని రక్షించేందుకు ప్రయత్నించిన కమాండర్ సహా బృందాన్ని కూడా చంపేశారని రూబిన్ తన మ్యాగజైన్ లో రాసుకొచ్చారు. సిద్ధిఖీని ముందుగా తీవ్రంగా హింసించి తలపై కొట్టి తుపాకీతో కాల్పులు జరిపారు. అనంతరం అతన్ని ఉరితీసినట్టు నివేదిక తెలిపింది. తాలిబన్లు హింసించిన తీరును చూస్తే.. యుద్ధ నియమాలను సంప్రదాయాలను గౌరవించలేదని తెలుస్తోంది.
రోహింగ్యాల సంక్షోభాన్ని కవర్ చేసినందుకు 2018లో సిద్ధిఖీ పులిట్జర్ బహుమతిని గెలుచుకున్నాడు. అఫ్ఘనిస్తాన్ వివాదం, హాంకాంగ్ నిరసనలు, ఆసియా, మధ్యప్రాచ్యం ఐరోపాలోని ప్రధాన సంఘటనలను కవర్ చేశాడు. జూలై 18 సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయానికి సిద్ధిఖీ భౌతిక కాయం చేరుకుంది ఆ తరువాత జామియా నగర్లోని అతని నివాసానికి తీసుకువచ్చారు. జామియా మిలియా ఇస్లామియా స్మశానవాటికలో సిద్ధిఖి అంత్యక్రియలు జరిగాయి.
