PM Modi ఉత్తరప్రదేశ్లోని ఖుషీనగర్లో బౌద్ధ తీర్థయాత్రను మరింత ప్రోత్సహించే విధంగా దాదాపు రూ.260కోట్లతో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బుధవారం(అక్టోబర్-20,2021)ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విమానాయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఉత్తర్ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స కుమారుడు, క్రీడా శాఖ మంత్రి నమల్ రాజపక్స నేతృత్వంలోని ఐదురుగు శ్రీలంక మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ…ఎన్నో దశాబ్దాల ఆశలు, అంచనాలు ఫలితమే కుషీనగర్ విమానాశ్రయన్నారు. ఈ రోజు తన సంతోషం రెట్టింపయిందన్నారు. తన జీవిత ప్రయాణంలో ఇప్పుడు సంతృప్తి నెలకొందన్నారు. కుషీనగర్ ఎయిర్పోర్ట్ విమానయాన రంగానికి సరికొత్త శక్తిని ఇస్తుందని, పర్యటకం కొత్త పుంతలు తొక్కుతుందని మోదీ అన్నారు. పెట్టుబడులు పెరుగుతాయని, ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు.
ఎయిర్ పోర్ట్ ని ప్రారంభించిన అనంతరం ఖుషీనగర్లో ఉన్న మహాపరినిర్వాణ ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడ బుద్ధుడికి పూజలు చేసి..బుద్ధుడి విగ్రహానికి ఒక వస్త్రాన్ని(చివార్)సమర్పించారు. ఆ తర్వాత మహాపరినిర్వాణ ఆలయం వద్ద బోధి వృక్షాన్ని మోదీ నాటారు. చరిత్రకారుల ప్రకారం బుద్ధుడు ఖుషీనగర్లోనే తన తుదిశ్వాను విడిచినట్లు తెలుస్తోంది.
ఇక ఖుషీనగర్ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి వచ్చిన వివిధ దేశాలకు చెందిన బౌద్ధ సన్యాసులను కూడా ప్రధాని మోదీ సన్మానించారు. అబిద్ధామ దినాన్ని పురస్కరించుకుని ఆయన ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బౌద్ధ సన్యాసులకు చివార్ వస్త్రాలను అందజేశారు. శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్, దక్షిణ కొరియా, నేపాల్, భూటాన్, కాంబోడియా దేశాలకు చెందని బౌద్ధ మతగురువులతో పాటు వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్లు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.
అశోక చక్రవర్తి కుమారుడు మహేంద్ర, కుమార్తె సంగమిత్రలు తొలిసారి బుద్దుడి సందేశాలను శ్రీలంకకు చేరవేసినట్లు తెలుస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వాతావరణ సంరక్షణ, వాతావరణ మార్పులు గురించి ఆందోళన చెందుతున్నామని, అయితే బుద్దుడి బోధనలను అనుసరిస్తే, అప్పుడు మనం ఏం చేయాలన్న సంకల్పం కలుగుతుందని, దానితోనే మార్పు సాధ్యమవుతుందని ప్రధాని అన్నారు. శ్రీలంక మంత్రి నమల్ రాజపక్షకు భగవద్గీతరు మోదీ గిఫ్ట్గా ఇచ్చారు. ఇక, కుషినగర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన మొదటి విమానంలో తాను ఉండటం గొప్ప గౌరవం అని నమల్ రాజపక్సే అన్నారు
కాగా, కుషీనగర్ బౌద్ధులకు అత్యంత ప్రసిద్ధ క్షేత్రాల్లో ఒకటి. గౌతమ బుద్ధుడు తన చివరి రోజుల్లో ఇక్కడే గడిపారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ సాధువులు ఏటా ఇక్కడకు వస్తుంటారు. ముఖ్యంగా శ్రీలంకలో నివసించే బౌద్ధులు.. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి మార్గం సులభం కానుంది.
ALSO READ Samantha : 3 యూట్యూబ్ ఛానెళ్లపై సమంత పరువు నష్టం దావా