PM Modi birthday : సెప్టెంబరు 17 ప్రధాని పుట్టిన రోజు .. నమీబియా నుంచి వచ్చిన చీతాలను కునో నేషనల్ పార్క్లో విడుదల చేయనున్న మోడీ
సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు. ఈ సందర్భంగా మోడీ మధ్యప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శివ్ పూర్ జిల్లాలో కునో నేషనల్ పార్క్ వద్ద చిరుతపులుల ఖండాంతర తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. చీతాలను కునో నేషనల్ పార్క్ లో విడుదల చేయనున్నారు.
- nagamani
- Published On : September 15, 2022 / 03:54 PM IST
pm modi will launch a rare project on his birthday In Madhyapradesh
PM Modi birthday : సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు. ఈ సందర్భంగా మోడీ మధ్యప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శివ్ పూర్ జిల్లాలో కునో నేషనల్ పార్క్ వద్ద చిరుతపులుల ఖండాంతర తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఓ ఖండంలో జీవిస్తున్న చిరుతపులులను మరో ఖండంలో ప్రవేశపెట్టడం ప్రపంచంలో ఇదే ప్రథమం. ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశం నుంచి ఎనిమిది చీతాలను భారత్ కు తీసుకురానున్న విషయం తెలిసిందే. రేపు అంటే సెప్టెంబర్ 16కు భారత్ కు నమీబియా చీతాలు చేరుకోనున్నాయి. నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుతపులులను మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో ప్రవేశపెట్టనున్నారు.
అంటే ప్రధాని పర్యటనకు ఒకరోజు ముందుగా నమీబియా నుంచి చిరుతలు కునో ప్రాంతానికి చేరుకోనున్నాయి. చీతాలు వచ్చాక ప్రధాని చీతాల ఖండాంతర తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీని కోసం ఈ ప్రాంతంలో తాజాగా 10 హెలీప్యాడ్ లు నిర్మించారు. దాదాపు 9 వేల కిలోమీటర్లు ప్రయాణించి..ఖండం దాటి నమీబియా నుంచి చిరుతపులులు భారత్ లోని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి రానున్నాయి.
ప్రధాని మోడీ పర్యటనను ఖరారు చేస్తూ ప్రధానమంత్రి కార్యాలయం మధ్యప్రదేశ్ సీఎంవోకు సమాచారం అందించింది. ప్రధాని పర్యటన క్రమంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ చీతా ప్రాజెక్టును ప్రారంభించాలంటూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించిన విషయం తెలిసిందే.
చిరుతలను భారతదేశానికి తీసుకురావడం బహిరంగ అటవీ గడ్డి భూముల పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణలో సహాయపడుతుంది. ఇది స్థానిక సమాజానికి మెరుగైన జీవనోపాధి అవకాశాలకు ఉపయోగపడుతుంది. పర్యావరణ పరిరక్షణ వన్యప్రాణుల పరిరక్షణ పట్ల ప్రధానమంత్రి నిబద్ధతకు అనుగుణంగా ఆపరేషన్ చీతా అని ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఈక్రమంలో ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద నాలుగు ట్రైబల్ గ్రూప్స్ స్కిల్లింగ్ కేంద్రాలను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
