Narendra Modi: మన బాలరాముడు ఇకపై టెంట్లో ఉండాల్సిన అవసరం లేదు: మోదీ భావోద్వేగభరిత వ్యాఖ్యలు
రామమందిరం విషయంలో కొంత మంది ఆలోచనా ధోరణి మార్చుకోవాలని, శ్రీ రాముడు వివాదం కాదని, ఓ సందేశమని చెప్పారు.
- T Venkateshwarlu
- Published On : January 22, 2024 / 02:59 PM IST
PM Modi
మన బాలరాముడు ఇకపై టెంట్లో ఉండాల్సిన అవసరం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇక నుంచి మన రాముడు మందిరంలో ఉంటాడని చెప్పారు. శ్రీరామ ప్రతిష్ఠాపన తర్వాత మోదీ ప్రసంగించారు. జనవరి 22 చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు.
వెయ్యేళ్ల తర్వాత కూడా జనవరి 22 గురించి మాట్లాడుకుంటారని మోదీ అన్నారు. రామాలయ నిర్మాణం జరుగుతున్నపుడు దేశ ప్రజల్లో ఎంతో విశ్వాసం నెలకొందని చెప్పారు. రాముడు త్రేతాయుగంలో 14 ఏళ్లు అయోధ్యకు దూరంగా ఉన్నాడు.. ఇప్పుడు మళ్లీ అయోధ్యకు రావడానికి శతాబ్దాలు పట్టిందని చెప్పారు.
స్వాత్రంత్ర్యం వచ్చిన తర్వాత రామాలయ నిర్మాణానికి రాజ్యాంగబద్ధంగా పోరాటం చేశామని తెలిపారు. ఎన్నో త్యాగాలతో మన రాముడు తిరిగి వచ్చాడని అన్నారు. రామమందిరం విషయంలో కొంత మంది ఆలోచనా ధోరణి మార్చుకోవాలని, శ్రీ రాముడు వివాదం కాదని, ఓ సందేశమని చెప్పారు.
రామమందిర కలను సాకారం చేసినందుకు న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు తెలుపుతున్నానని మోదీ అన్నారు. ప్రాణప్రతిష్ఠ ముందు తాను 11 రోజులు దీక్ష చేశానని తెలిపారు. అయోధ్య రామాలయం శాంతి, సామరస్యానికి ప్రతీక అని చెప్పారు.
Ayodhya Shri Ram Idol : అయోధ్య రాముడి రూపం ఇదే.. ప్రధాని మోదీ పూజలు.. ఫొటోలు..
