మంకీఫాక్స్పై డబ్ల్యూహెచ్వో హెచ్చరిక.. అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు
మంకీఫాక్స్ ను ఎదుర్కొనే విషయంలో సన్నద్ధతపై చర్చించారు. వ్యాధి వ్యాప్తిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని అధికారులను మోదీ ఆదేశించారు.
- Harishth Thanniru
- Published On : August 19, 2024 / 08:35 AM IST
PM Narendra Modi
Monkeypox : ప్రపంచ వ్యాప్తంగా మంకీఫాక్స్ వేగంగా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాక.. మంకీఫాక్స్ వ్యాప్తి విషయమై గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. డబ్ల్యూహెచ్వో ఇలా ప్రకటించడం రెండోళ్లలో ఇది రెండోసారి. మంకీ ఫాక్స్ పై డబ్ల్యూహెచ్వో హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. భారత్ లో మంకీఫాక్స్ విస్తరించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ డా. పీకే మిశ్రా నేతృత్వంలోని అధికారుల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
Also Read : Monkeypox Name Changed : మంకీపాక్స్ పేరు మార్పు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన
ఈ సమీక్షలో మంకీఫాక్స్ ను ఎదుర్కొనే విషయంలో సన్నద్ధతపై చర్చించారు. వ్యాధి వ్యాప్తిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని అధికారులను మోదీ ఆదేశించారు. అన్నిరాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబ్ లను సిద్ధంగా ఉంచాలని, దేశవ్యాప్తంగా ఈ వ్యాధి వ్యాప్తిపై పెద్దెత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని మోదీ సూచించారు. 2022లో 116 దేశాల్లో 99,176 మంది ఈ వ్యాధి బారినపడగా, 208 మంది మరణించారు. కాంగో దేశంలో ఈ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయని డబ్ల్యూహెచ్వో గుర్తించిందని మోదీ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 15,600 కేసులు గుర్తించగా.. 537 మంది మరణించారని, అయితే, భారత్ లో ఇప్పటి వరకు ఈ ఏడాది ఒక్క కేసుకూడా నమోదు కాలేదని మోదీ అన్నారు. ఆఫ్రికాలోని అనేక రాష్ట్రాల్లో మంకీపాక్స్ విస్తరిస్తున్న దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ గా ప్రకటించిందని మోదీ అన్నారు.
Also Read : Monkeypox to pet dogs: ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మనుషుల నుంచి కుక్కకు సోకిన మంకీపాక్స్
మంకీఫాక్స్ కేసులను సత్వరమే గుర్తించేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులను ఆదేశించారు. వ్యాధిని అడ్డుకోవడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అయితే, ప్రస్తుతం 32 ల్యాబ్ లను పరీక్షలకోసం రెడీ చేయగా.. మరికొన్ని సిద్ధం చేసేందుకు అధికారులు దృష్టిసారించారు.
