Agnipath Scheme : అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు..స్కీమ్ రద్దు చేయాలని డిమాండ్
తమ భవిష్యత్తుకు భరోసా కల్పించని అగ్నిపథ్ స్కీమ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది యువత. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిరసన ప్రదర్శనలతో యావత్ దేశం అట్టుడికిపోతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకంపై కన్నెర్ర చేస్తున్న అభ్యర్థులు.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేందుకు సైతం వెనుకాడటం లేదు.
- bheemraj
- Published On : June 17, 2022 / 10:39 AM IST
Agnipath
Agnipath Scheme : అగ్నిపథ్ పథకం..కేంద్ర ప్రభుత్వానికి అగ్ని పరీక్షగా మారింది. సైన్యంలో నియామకాల కోసం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం దేశంలోని అనేక రాష్ట్రాలను అగ్నిగుండంగా మార్చేసింది. దేశవ్యాప్తంగా అగ్నిపథ్కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనకారుల విధ్వంసంతో.. ఉత్తరభారతం అట్టుడుకుతోంది. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా.. ఆందోళనకారులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీలో యువత ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్రం ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలపై యువత కన్నెర్రజేస్తోంది. సాయుధ దళాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలపై.. ఆర్మీ ఉద్యోగార్థులు భగ్గుమన్నారు.
తమ భవిష్యత్తుకు భరోసా కల్పించని అగ్నిపథ్ స్కీమ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది యువత. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిరసన ప్రదర్శనలతో యావత్ దేశం అట్టుడికిపోతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకంపై కన్నెర్ర చేస్తున్న అభ్యర్థులు.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. ఆందోళనల్లో పలు బస్సులు, రైళ్లు దగ్ధమయ్యాయి. నిరసనకారులు రోడ్లను దిగ్బంధించడంతో జాతీయ రహదారులపై భారీయెత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. 34 రైళ్లు రద్దయ్యాయి. పదుల సంఖ్యలో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులు.. కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదంటున్నారు.
బీహార్లోని 8 జిల్లాల్లో ఆందోనకారులు రెచ్చిపోయారు. నవడా బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. మూడు రైళ్లను తగులబెట్టారు. ఆరా రైల్వే స్టేషన్లో విధ్వంసం సృష్టించారు. రైలు బోగీలను కాల్చి బూడిద చేశారు. అటు ముజఫర్పూర్, బక్సర్, బెగూసరాయ్, సరన్, ముంగేర్, నవడ, కైమూర్లో యువత భారీగా రోడ్లపైకి వచ్చి.. టైర్లను తగులపెట్టి నిరసన తెలిపారు. చాప్రాలోనూ యువత విధ్వంసానికి దిగింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వసం చేశారు ఆందోళనకారులు. పలుచోట్ల ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. గోపాల్గంజ్, కైమూర్ జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
అటు.. మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లోనూ ఆందోళనలు మిన్నంటాయి. హర్యానాలోని పల్వాల్ జిల్లాలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. పోలీసు వాహనం సహా ఇతరవాహనాలకు నిప్పుపెట్టారు. రెండు గంటల పాటు రోడ్లపైకి వాహనదారులు రాకుండా అడ్డుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్, SMS సేవలను నిలిపివేశారు. ఆందోళనకారులు ఏకంగా పోలీసు వాహనాలకే నిప్పుపెట్టడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. అటు జార్ఖండ్ రాజధాని రాంచీలోనూ ఆందోళనలు కొనసాగాయి. దీంతో ముందస్తుగా పోలీసులు 144సెక్షన్ అమలు చేశారు. మొత్తంమ్మీద అగ్నిపథ్పై ఉత్తరభారతంలో ఆందోళనలు ఉధృతమయ్యాయి.
