Punjab Crises: సీఎం పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్
పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయకుండానే, అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు.
- vamsi
- Published On : September 18, 2021 / 05:02 PM IST
Humiliated Amarinder Singh Resigns as CM
Punjab Crises: పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయకుండానే, అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. రాజ్ భవన్కు వెళ్లి గవర్నర్ బన్వర్ లాల్ పురోహిత్కు రాజీనామా లేఖను సమర్పించారు. మంత్రి మండలి సభ్యుల రాజీనామాలను కూడా గవర్నర్కు అందజేశారు కెప్టెన్ అమరిందర్ సింగ్.
పంజాబ్ ప్రభుత్వంలోని 60 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ని వీడతామంటూ సోనీయాకు లేఖ రాసిన అనంతరం.. అమరీందర్ సింగ్ను తప్పుకోవాలని కోరింది కాంగ్రెస్ హైకమాండ్. 60మంది ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వచ్చిన క్రమంలోనే సీఎం పదవికి రాజీనామా చేశారు అమరీందర్ సింగ్.
ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్కి సోనియా గాంధీ ఫోన్ చేశారని, రాజీనామా చెయ్యమని కోరారని, అటువంటి అవమానాన్ని తాను సహించనని అమరీందర్ సింగ్ చెప్పినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే తనను సీఎం పదవి నుంచి తొలగిస్తే కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతానని కెప్టెన్ కూడా తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.
రాజీనామా తర్వాత అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. “కాంగ్రెస్ తనపై విశ్వాసంతో ముఖ్యమంత్రిని చేసింది. కానీ, ప్రభుత్వాన్ని నడిపే విషయంలో ఇప్పుడు పార్టీకి అనుమానం వచ్చింది. ఎవరి మీద నమ్మకముంటే వారిని సీఎం చేసుకోవచ్చునని వారికి చెప్పాను. ఈ విషయంలో నన్ను అవమానించారు. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. కాంగ్రెస్ హైకమాండ్కి రాజీనామా గురించి తెలియజేశాను. నా మద్దతుదారులతో మాట్లాడిన తర్వాత నేను తర్వాతి నిర్ణయం తీసుకుంటాను.” అని చెప్పారు.
