Rajasthan: రాజస్థాన్లో సీజేపీ బృందానికి షాక్.. స్కూళ్ల పరిశీలనకు వెళ్తే గ్రామస్తుల ఆగ్రహం.. రాళ్లతో దాడి
రాజస్థాన్(Rajasthan)లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పరిశీలనకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) బృందానికి చేదు అనుభవం ఎదురైంది.
- V Santhosh Kumar
- Published on- August 21, 2026 / 03:04 PM IST
Cjp team attacked by locals during school theek karo visit in jaipur
- రాజస్థాన్లో సీజేపీపై దాడి
- రాళ్లతో కార్యకర్తలను కొట్టిన స్థానికులు
- ఈవెంట్పై విమర్శలు చేసిన నాయకులు
Rajasthan: రాజస్థాన్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పరిశీలనకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)(Rajasthan) బృందానికి చేదు అనుభవం ఎదురైంది. ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రంకా నేతృత్వంలో కార్యకర్తలు జైపుర్ జిల్లాలోని రాంపురా కన్వర్పురా గ్రామానికి వెళ్లేందుకు యత్నించగా, ఊరి శివారులోనే స్థానికులు వారిని అడ్డుకున్నారు. తమ స్కూళ్లను తామే బాగు చేసుకుంటామని చెబుతూ వారిని బలవంతంగా వెనక్కి పంపించేశారు. ఈ క్రమంలో స్థానికులు తమపై రాళ్లతో దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేశారని అశుతోష్ ఆరోపించారు.
ACB Raids: తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.6.87 కోట్ల ఆస్తులు స్వాధీనం.. ఇది ఎన్నోసారి తెలుసా?
బీజేపీ ప్రభుత్వంపై అభిజీత్ దీప్కే తీవ్ర విమర్శలు:
ఈ దాడి ఘటనపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందిస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాడులకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ, రాజస్థాన్లోని బీజేపీ ప్రభుత్వమే ఈ దాడికి కారణమని విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తలపై రాళ్లు విసిరి గాయపరిచారని, ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడికి రాకపోవడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో గూండాల పాలన నడుస్తోందని ఆయన ఆరోపించారు.
నెట్టింట వైరల్గా మారిన వీడియోలు:
పాఠశాలల సౌకర్యాల పరిశీలన కోసం వెళ్లిన ఒక బృందంపై ఈ స్థాయిలో విరుచుకుపడటం, వాహనాలను ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ స్థానిక యంత్రాంగం సరిగ్గా స్పందించలేదని సీజేపీ నేతలు ఆరోపిస్తుండగా, ఈ ఘటనపై రాజస్థాన్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
