Sanjay Raut: ఐరాస చీఫ్కు సంజయ్ రౌత్ లేఖ.. జూన్ 20ని ప్రపంచ దేశద్రోహుల దినోత్సవంగా ప్రకటించాలంటూ విజ్ఞప్తి.. ఎందుకంటే?
గతేడాది జూన్ 20న శివసేనకు చెందిన కీలక నేత ఏక్నాథ్ షిండే పార్టీలోని తన అనుకూల ఎమ్మెల్యేలు 40 మందితో బీజేపీతో జట్టుకట్టాడు. దీంతో శివసేన రెండుగా చీలిపోయింది. అప్పటి వరకు మహారాష్ట్రలో పాలనసాగిస్తున్న మాహావికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది.
- Harishth Thanniru
- Published On : June 20, 2023 / 10:54 AM IST
Sanjay Raut
Sanjay Raut Letter To UN: శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) ఐక్యరాజ్య సమితి (United Nations) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ (Antonio Guterres) కు లేఖ రాశారు. ఈ లేఖలో జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. అదేతరహాలో జూన్ 20వ తేదీని ప్రపంచ దేశ ద్రోహుల దినోత్సవంగా జుపుకోవాలని, ఆ మేరకు ఐరాస నుంచి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన లేఖను సంజయ్ రౌత్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
జూన్ 20వ తేదీని ప్రపంచ దేశ ద్రోహుల దినోత్సవంగా ఎందుకు ప్రకటించాలో కూడా లేఖలో సంజయ్ రౌత్ వివరించారు. గతేడాది జూన్ 20న ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని 40 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉద్దవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేశారు. దీని తరువాత ఉద్దవ్ నేతృత్వంలోని మాహావికాస్ అఘాడీ ప్రభుత్వం పడిపోయింది. తనవెంట వచ్చిన 40 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఏక్నాథ్ షిండే బీజేపీతో జట్టుకట్టాడు. ఆ తరువాత బీజేపీ, శివసేన ప్రభుత్వంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, శివసేనను వీడిన వారికి 50 కోట్ల చొప్పున బీజేపీ నుంచి అందాయని సంజయ్ రౌత్ ఆరోపించారు.
మా పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే అనారోగ్యంతో ఉన్నప్పుడు షిండే నమ్మకద్రోహం చేశాడని రౌత్ అన్నారు. జూన్ 21ని ప్రపంచ యోగా దినోత్సవంగా పాటిస్తున్నట్లుగానే జూన్ 20వ తేదీని ప్రపంచ ద్రోహుల దినోత్సవంగా ప్రకటించాలని రౌత్ ఐక్యరాజ్య సమితికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉంటే శివసేన 57వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రే వర్గం వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహించింది.
PUBLIC DEMAND!@UN@antonioguterres@UNinIndia @PMOIndia @UNICEFIndia @BJP4India @AUThackeray @unfoundation @UNHumanRights pic.twitter.com/OJ5qu28oY2
— Sanjay Raut (@rautsanjay61) June 20, 2023
