Supreme Court
supreme court : మీ భార్యను ఖర్చుల లెక్కలు అడుగుతున్నారా..? అయితే, ఈ విషయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఓ కేసు విషయంలో తీర్పు ఇచ్చిన కోర్టు.. భార్యను ఖర్చుల లెక్కలు అడగడం క్రూరత్వం కిందికిరాదని పేర్కొంది.
హైదరాబాద్ కు చెందిన మహిళకు 2016లో వివాహం జరిగింది. భార్యా,భర్త ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. పెళ్లి తరువాత వీరు అమెరికా వెళ్లారు. 2019 వరకు అక్కడే కలిసి ఉన్నారు. ఈ క్రమంలో వారికి బాబు పుట్టాడు. ఆ తరువాత ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో మహిళ భర్తను వదిలి తన కుమారుడితో హైదరాబాద్లోని తన పుట్టింటికి వచ్చింది. దాంపత్య హక్కుల పునరుద్దరణ కోరుతూ 2022లో ఆమెను అమెరికాకు తిరిగి రావాలని భర్త నోటీసు పంపారు. దీంతో మహిళ పోలీస్ స్టేషన్ లో భర్త, ఆతని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్లో ఉంటున్న మహిళ 2022లో సరూర్నగర్ మహిళా పోలీస్ స్టేషన్లో తన భర్తపై ఫిర్యాదు చేసింది. గృహహింస, వరకట్న వేధింపుల నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేసింది. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న భర్తతోపాటు ఆయన కుటుంబ సభ్యులపైన ఫిర్యాదు చేసింది.
తాను ఇండియా వచ్చాక నాకు, నా బిడ్డ పోషణకు ఒక్కరూపాయి కూడా పంపించలేదు. కుటుంబ అవసరాల కోసం ఎప్పుడు డబ్బులు అడిగినా ప్రతీపైసా లెక్క అడుగుతారు. ఇండియాలో ఉన్న వారి తల్లిదండ్రలకు మాత్రం లక్షల్లో డబ్బు పంపిస్తున్నాడు అంటూ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు అమెరికాలో ఉంటున్న మహిళ భర్తకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
పోలీసులు పంపించిన నోటీసులపై భర్త హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ తనకు అనుకూలమైన తీర్పు రాలేదు. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ ఆర్. మహాదేవన్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
‘‘ఈ కేసులో భర్తపై మహిళ చేసిన ఆరోపణలు రోజువారీ సంసారంలో జరిగే కీచులాటల్లాగానే కనిపిస్తున్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్రూరత్వం కింద పరిగణించడానికి వీల్లేదు. అమెరికాలో ఉంటున్న భర్త తన కుటుంబ సభ్యులకు డబ్బు పంపడాన్ని అపార్థం చేసుకోవడానికి వీల్లేదు. భర్త లెక్కలడగడం క్రూరత్వ నిర్వచన పరిధిలోకి రాదు. తాను గర్భవతిగా ఉన్నప్పుడు భర్త సరిగా చూసుకోలేదని, కాన్పు అయిన తర్వాత లావుతగ్గమని వేధించాడని భార్య ఆరోపిస్తున్నారు. ఒకవేళ నిజమే అనుకున్నా అది సదరు వ్యక్తి గుణాన్ని ప్రతిబింబిస్తుంది తప్పితే క్రూరత్వం కిందికి రాదు. ఎఫ్ఐఆర్లో భార్య చేసిన ఆరోపణలు నిరాధారంగా ఉన్నాయి అని ధర్మాసనం పేర్కొంది.’’