Supreme Court Advocate joined TMC : సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మజీద్ మెమన్ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. ప్రజాస్వామ్యాన్ని, దేశ దర్మాన్ని పరరక్షించడానికే టీఎంసీలో చేరినట్లు ఆయన తెలిపారు.పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పులి అని ఆయన అభివర్ణించారు.
టీఎంసీ నాయకురాలు మమతది పులి గొంతని, పశ్చిమ బెంగాల్ లోనే కాదు దేశవ్యాప్తంగా వినిపిస్తోందన్నారు. లోటుపాట్లు ఉన్నప్పటికీ డబ్బు, కండ బలాన్ని ఆమె ఎదుర్కొన్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా శాంతిభద్రతలను కేంద్ర ఏజెన్సీలు దుర్వినియోగం చేస్తున్నాయని విమర్శించారు. ఈ తరుణంలో తృణమూల్ దానిని సవాల్ చేస్తోందన్నారు.
Gujarat Polls: బీజేపీ ప్రచారంలో విదేశీయులు.. ఎన్నికల సంఘానికి టీఎంసీ ఫిర్యాదు
తమ పార్టీ బలపడుతోందని టీఎంసీ పేర్కొంది. ‘తృణమూల్ కుటుంబం బలపడుతోంది. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రముఖ క్రిమినల్ లాయర్, ఎన్సీపీ మాజీ ఎంపీ మజీద్ మెమన్ ఢిల్లీలో నేడు ఎంపీ సొగత్ రాయ్, పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ సమక్షంలో టీఎంసీలో చేరారు’ అని ట్వీట్ చేసింది.
రాజ్యసభ మాజీ సభ్యుడు మజీద్ మెమన్ ఇటీవలే ఎన్సీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆ పార్టీని వీడినట్లు పేర్కొన్నారు. కాగా, మరోసారి రాజ్యసభకు అవకాశం ఇవ్వకపోవడంతో మజీద్ ఎన్సీపీని వీడినట్లు సమాచారం.