Terrorists Lob Grenade At Crpf Vehicle In Pulwamas Tral Area 7 Injured
Grenade Attack జమ్మూకశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆదివారం పుల్వామా జిల్లాలోని త్రాల్ బస్టాండ్ సమీపంలో గస్తీ కాస్తోన్న సీఆర్పీఎఫ్ వాహనాన్ని పేల్చేయాలనే లక్ష్యంతో ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరిపారిపోయారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఎవరికీ ఏమీ కాలేదు. అయితే ఎనిమిది పౌరులు మాత్రం స్వల్పంగా గాయపడ్డారు.
టెర్రరిస్టుల గ్రెనేడ్ దాడిలో గాయపడ్డ స్థానికులను భద్రతా బలగాలు హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఉగ్రవాదులు విసిరిన బాంబుల తక్కువ తీవ్రత ఉన్నవి అని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే బలగాలు.. ట్రాల్ పట్టణాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు . ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపి కూంబింగ్ చేస్తున్నారు.
ఇటీవల కశ్మీర్ లో ఇలాంటి గ్రెనేడ్ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. మే 26న కూడా ట్రాల్ లో ఇదే విధంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సిబ్బందిపైకి ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో ప్రాణాపాయం జరగలేదని, అదేవిధంగా ఎవరూ గాయపడలేదని వివరించారు. కొద్ది రోజుల క్రితం ట్రాల్ మునిసిపల్ చైర్మన్, బీజేపీ నేత రాకేశ్ పండితపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో, ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇక, మే 12న సాంబా జిల్లాలో పోలీసుల బృందంపై దాడి చేశారు. సాంబా-ఉదంపూర్ రోడ్డుపై సాధారణ తనిఖీలు చేస్తున్న సమయంలో వారిపై బాంబులు విసిరారు.