Supreme Court
Supreme Court collegium key decision : దేశ వ్యాప్తంగా న్యాయమూర్తుల ఖాళీల భర్తీలో సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలో ఒకేసారి 12 హైకోర్టులకు ఒకేసారి 68 మంది పేర్లను న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది. 12 రాష్ట్రాల్లో 270 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉంటే 68 పేర్లను సిఫార్సు చేసింది. 68 మందిలో 10 మంది మహిళలు ఉన్నారు. అలహాబాద్(16), కోల్ కతా(10), కేరళ( 8), రాజస్థాన్(7), ఝార్ఖండ్(5), గౌహతి(5), మద్రాస్(4), జమ్మూకాశ్మీర్(4), పంజాబ్-హారియణా(4), కర్ణాటక(2), చత్తీస్గడ్(2), మధ్యప్రదేశ్(1) సిఫార్సు లు చేసింది.
హైకోర్టుల న్యాయమూర్తుల నియామకాలపై ఆగస్టు 25, సెప్టెంబరు1న జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్ల నేతృత్వంలోని కొలీజియం సమావేశమైంది. మొత్తం 113 మంది పేర్లను పరిశీలించారు. అందులో 82 మంది న్యాయవాదులు, 31 మంది జ్యుడీషియల్ సర్వీస్ అధికారులు ఉన్నారు. సునిశిత పరిశీలన అనంతరం 44 మంది న్యాయవాదులు, 24 మంది జ్యుడీషియల్ సర్వీసెస్ అధికారులను హైకోర్టు న్యాయమూర్తి పదవులకు సిఫార్సు చేసింది.
గువాహటి హైకోర్టుకు షెడ్యూల్డ్ తెగలకు చెందిన మహిళా జ్యుడీషియల్ అధికారి మరాలి వంకుంగ్ పేరును సిఫార్సు చేసింది. కొలీజియం సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపితే మిజోరం నుంచి వచ్చిన తొలి హైకోర్టు న్యాయమూర్తిగా ఆమె రికార్డులకెక్కునుంది. ఆగస్టు 17న సుప్రీంకోర్టుకు 9 మంది న్యాయమూర్తుల పేర్లను, తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియ పూర్తైంది.