Wrestlers Protest: రెజ్లర్ల నిరసన ఎఫెక్ట్.. అయోధ్యలో జరగాల్సిన డబ్ల్యూఎఫ్ఐ సమావేశం రద్దు.. సహాయ కార్యదర్శి సస్పెన్షన్
బ్రిజ్ భూషణ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సంఘంలో రోజువారి కార్యకలాపాలు అన్నింటిని నిలిపివేయాలని క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ క్రమంలో ఈరోజు అయోధ్యలో జరగాల్సిన డబ్ల్యూఎఫ్ఐ అత్యవసర జనరల్ కౌన్సిల్ సమావేశం రద్దయింది.
- Harish Thanniru
- Updated on- January 22, 2023 / 11:50 AM IST
Wrestlers Protest
Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపులు, అవినీతి ఆరోపణలు చేస్తూ మహిళ రెజ్లర్లు నిరసన చేపట్టిన విషయం విధితమే. కేంద్ర క్రీడాశాఖ మంత్రి హామీతో నిరసనకు రెజ్లర్లు తాత్కాలిక విరామం ప్రకటించారు. కేంద్ర మంత్రితో సమావేశంలో రెజ్లర్లు పలు డిమాండ్లను ఆయనముందు ఉంచినట్లు తెలిసింది. అన్నింటిపై విచారణకు కమిటీ వేయడంతోపాటు నాలుగు వారాల్లో నివేదిక పూర్తిచేసి తదుపరి చర్యలు తీసుకొనేలా హామీ ఇచ్చారు.
బ్రిజ్ భూషణ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సంఘంలో రోజువారి కార్యకలాపాలు అన్నింటిని నిలిపివేయాలని క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ క్రమంలో ఈరోజు అయోధ్యలో జరగాల్సిన డబ్ల్యూఎఫ్ఐ అత్యవసర జనరల్ కౌన్సిల్ సమావేశం రద్దయింది. రెజ్లర్లతో జరిగిన చర్చల నేపథ్యంలో కేంద్ర మంత్రి హామీ మేరకు.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక, అవినీతి ఆరోపణలపై విచారణ జరిపే పర్యవేక్షక కమిటీ సభ్యుల పేర్లను క్రీడా మంత్రిత్వ శాఖ నేడు ప్రకటించనుంది.
మరోవైపు డబ్ల్యూఎఫ్ఐ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ను సస్పెండ్ చేస్తూ కేంద్ర మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా సంఘంలో త్రోమర్ నడుచుకున్నాడని, అందుకే అతన్ని సస్సెండ్ చేస్తున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ లేఖలో పేర్కొంది. రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒలింపిక్ అసోసియేషన్ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఏడుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయించింది.
