Dharmendra Pradhan Resigns : బ్రేకింగ్ న్యూస్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా
Dharmendra Pradhan Resigns : నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
- Harish Thanniru
- Updated on- July 25, 2026 / 03:26 PM IST
Union Education Minister Dharmendra Pradhan Resigns
Dharmendra Pradhan resigns : నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. విద్యార్థుల ఆందోళనలతో కేంద్రం దిగొచ్చింది. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా ప్రధాన్ స్పందిస్తూ.. యువత ఆకాంక్షలను తాను గౌరవిస్తున్నట్లు తెలిపారు.
ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో కీలక అంశాలు ప్రస్తావించారు. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నట్లు చెప్పారు. పదిరోజుల నుంచి వరుస ఘటనలు నన్ను బాధించాయి. ఇది నా వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదు.. నేను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదు. యువశక్తే ఈ దేశానికి అసలైన శక్తి. యువత చదువుపై ఎక్కువ సమయం దృష్టిసారించాలి. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదని సూచించారు. యువత భవిష్యత్ కోసమే రాజీనామా చేశానని పేర్కొన్నారు. దేశ సేవకే నా అత్యున్నత ప్రాధాన్యమని, నాకు కేంద్ర మంత్రి పదవికి హోదా కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత కొద్దిరోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్దెత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని, విద్యార్థులపై నమోదైన కేసులు కొట్టివేయాలని డిమాండ్ చేశారు.
అయితే, ఈ డిమాండ్ల పై కేంద్ర ప్రభుత్వం పెద్దలతో సీజేపీ రెండు దఫాలుగా చర్చలు జరిపింది. ఆత్మహత్య చేసుకున్న వారికి రూ.కోటి పరిహారం, విద్యార్థులపై నమోదైన కేసులు ఎత్తివేతకు కేంద్ర పెద్దలు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. అయితే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు అంగీకరించలేదు. శుక్రవారం జరిగిన చర్చల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంపై శనివారం జరిగే చర్చల్లో స్పందిస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా, జితేందర్ సింగ్ లు సీజేపీ తరపున చర్చల్లో పాల్గొన్న వారితో పేర్కొన్నారు. అయితే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మా ఉద్యమం ఆపేది లేదని సీజేపీ తేల్చి చెప్పింది. ఈ క్రమంలో శనివారం సీజేపీతో మరోసారి చర్చలు జరగాల్సి ఉంది. ఈ చర్చలకు ముందే ధర్మేంద్ర ప్రధాన తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
