Samosa Dispute : చల్లటి సమోసాలు తెచ్చి తంటా.. ఐదు నెలల తరువాత ఊహించని షాక్..! ఐదుగురిపై కేసు నమోదు
UP Samosa Dispute : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. చల్లటి సమోసాల విషయంలో గత ఐదు నెలల క్రితం జరిగిన గొడపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు.
- Harish Thanniru
- Updated on- August 21, 2026 / 02:57 PM IST
Uttar Pradesh Samosa Dispute Reaches Court Varanasi Police Register Case
Uttar Pradesh Samosa Dispute: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. చల్లటి సమోసాల విషయంలో గత ఐదు నెలల క్రితం జరిగిన గొడపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు కోర్టు చేరడంతో దుకాణదారుడితోపాటు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. వివరాల్లోకి వెళితే..
Also Read – Nothing Phone 3 : వారెవ్వా.. రూ.80వేల నథింగ్ ఫోన్ 3 జస్ట్ రూ. 50వేలకే.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..!
ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యాయవాది శివశంకర్ సింగ్ చౌబేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జల్హుపూర్ మార్కెట్లోని ఓ స్వీట్ దుకాణం వద్దకు వెళ్లాడు. తినేందుకు సమోసాలు ఇవ్వాలని కోరగా.. దుకాణదారుడు గుప్తేశ్వర్ సింగ్ చల్లటి సమోసాలు ఇచ్చాడు. దీంతో నాకు వేడి సమోసాలు కావాలని న్యాయవాది శివశంకర్ కోరగా.. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.
ఈ ఘటనపై శివశంకర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై దుకాణం యాజమాని, అతని సిబ్బంది దాడి చేశాడని ఫిర్యాదు చేశాడు. కానీ, పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. దీంతో శివశంకర్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. శివశంకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన దుకాణదారుడు గుప్తేశ్వర్ సింగ్ తో సహా ఐదుగురిపై కేసు నమోదు చేయాలని చౌబేపూర్ పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
న్యాయవాది శివశంకర్ సింగ్ చెప్పిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన తాను చందౌలి నుంచి వారణాసికి ప్రయాణిస్తున్నాను. మార్గం మధ్యలో ఆకలి వేయడంతో జల్హుపూర్ మార్కెట్లోని ఒక స్వీట్ షాపులో రెండు సమోసాలు ఇవ్వాలని ఆర్డర్ చేశాను. వారు చల్లటి సమోసాలు ఇవ్వండంతో.. నేను వేడి సమోసాలు కావాలని కోరాను.. కానీ, దుకాణ యాజమాని ఆయన అనుచరులతో కలిసి నాపై దాడి చేశాడని శివశంకర్ సింగ్ ఆరోపించారు. నువ్వు ఏమైనా కలెక్టర్ వా.. వేడి వేడి సమోసాలు ఇచ్చేందుకు అంటూ తనపై వారు దుర్భాషలాడారని పేర్కొన్నాడు. అంతేకాదు.. వారు తన వద్ద నుంచి ఒక బంగారు గొలుసు, నగదు లాక్కొన్నారని ఆరోపించాడు. ఈ ఘటనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదని, పోలీస్ కమిషనర్ కు చెప్పుకున్నా ఫలితం కనిపించలేదని తెలిపాడు.
ఈ ఘటన తరువాత శివశంకర్ సింగ్ భారత న్యాయసంహితలోని సెక్షన్ 19(2), 115 (2) (హాని కలిగించడం), 352 (శాంతికి భంగం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగా నిందించడం), 35 (బెదిరింపులు)ల కింద కోర్టులో కేసు వేశాడు. కోర్టు కేసుతో పోలీసుల్లోనూ కదలిక వచ్చింది. గత శుక్రవారం ఈ ఘటనపై దుకాణం యాజమాని సహా ఐదుగురిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది.
