ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదంలో ఇరుక్కున్న కార్మికులను రక్షించేందుకు కొనసాగుతున్న ఆపరేషన్ చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం అయితే వారికి ఆహారం, నీరు, గాలి పంపిస్తున్నారు. మరో రెండు మీటర్లు తవ్వితే కార్మికులు చిక్కుకున్న ప్రదేశంతో లింక్ కలుస్తుంది. ఆ తర్వాత కార్మికుల్ని సురక్షితంగా బయటికి తీస్తారు. గత 17 రోజులుగా కార్మికులు అక్కడే ఉన్నారు. ఈ ఆపరేషన్ పై ఎన్డీఎంఏ అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సభ్యుడు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హస్నైన్ తన తాజా విలేకరుల సమావేశంలో ఈ సమాచారాన్ని వెల్లడించారు.
అపూర్వ విజయం
సయ్యద్ అతా హస్నైన్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు 58 మీటర్ల వరకు డ్రిల్లింగ్ జరిగింది. మా బృందం చాలా కష్టమైన పని చేస్తోంది. 58 మీటర్లకు చేరుకోవడం అపూర్వమైన విజయం. మరో 2 మీటర్లు వెళ్లాలి. అది ముగిస్తే డ్రిల్లింగ్ పూర్తైనట్టే. అయితే కార్మికుల్ని బయటికి రప్పించేందుకు అన్ని భద్రతా జాగ్రత్తలు తీసుకున్నాము’’ అని అన్నారు.
మూడు వేర్వేరు బృందాలు ఏర్పాటు
ఈ ఆపరేషన్ కోసం మూడు బృందాల్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎన్డీఆర్ఎఫ్ చాలా ముఖ్యమైన పాత్ర వహించనుందని హస్నైన్ వెల్లడించారు. వారు లోపలికి వెళ్లి ఇతర ఏర్పాటు చేస్తారు. దీనితో పాటు వైద్యాధికారులు కూడా సొరంగం లోపలికి వెళ్తారు. 41 మందిలో ఒక్కొక్కరిని తరలించేందుకు 3-5 నిమిషాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. పూర్తి తరలింపునకు 3-4 గంటలు పట్టవచ్చని భావిస్తున్నారు.
అత్యవసర పరిస్థితి కోసం హెలికాప్టర్
చిన్యాలిసౌర్ ఎయిర్స్ట్రిప్లో చినూక్ హెలికాప్టర్ ను సిద్దం చేసి ఉంచారు. అయితే ఈ హెలికాప్టర్ సాయంత్రం 4:30 లోపే టేకాఫ్ అవ్వాలి. రాత్రి పూట ఇది ఎగరకూడదు. రాత్రిపూట కూడా ఎగురుతుంది, కానీ వాతావరణం అనుకూలంగా లేదు. ఆలస్యం కావడంతో మరుసటి రోజు ఉదయం హెలికాఫ్టర్ ద్వారా కార్మికులను తీసుకువస్తారు. అత్యవసరమైతే కార్మికులను 1 లేదా 2 అంబులెన్స్లలో రిషికేశ్కు తీసుకువస్తారు. జిల్లా ఆసుపత్రిలో 30 పడకల సౌకర్యంతో పాటు 10 పడకల సౌకర్యంతో ఏర్పాట్లు పూర్తి చేశారు.