వేదాంత చేతికి బీపీసీఎల్!
- venkaiahnaidu
- Published On : November 18, 2020 / 09:33 PM IST
Vedanta puts in expression of interest to buy govt’s entire stake in BPCL దేశంలో రెండో అతిపెద్ద రిటైల్ ఇంధన సంస్థ భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(BPCL)లోని ప్రభుత్వ వాటా కొనుగోలుకు వేదాంత గ్రూప్ ఆసక్తి వ్యక్తీకరణ(EoI) పత్రాన్ని దాఖలు చేసింది. బీపీసీఎల్లో కేంద్ర ప్రభుత్వానికి 52.98 శాతం వాటా ఉంది. బీపీసీఎల్కు కొచ్చిన్, ముంబై, మధ్యప్రదేశ్లోని బినాలో మూడు రిఫైనరీలు ఉన్నాయి. దేశీయ పెట్రో ఉత్పత్తుల రిటైల్ మార్కెట్లో కంపెనీకి 22 శాతం వాటా ఉంది.
ఇప్పటికే ఉన్న వేదాంత చమురు,గ్యాస్ వ్యాపారాల విస్తరణకు బీపీసీఎల్ మరింత దోహదపడుతుందని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. బీపీసీఎల్లో కేంద్ర ప్రభుత్వానికి 52.98శాతం వాటా ఉన్నది. ప్రస్తుతం తీవ్రమైన నిధుల కొరత ఎదుర్కొంటున్న ప్రభుత్వం… పలు ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ద్వారా నిధులను సమకూర్చుకుంటోంది. ఇందులో భాగంగానే బీపీసీఎల్ వాటాను అమ్మకానికి పెట్టింది. నవంబర్ 16తో బీపీసీఎల్ బిడ్డింగ్కి ఈవోఐ ప్రక్రియ ముగిసింది. బీపీసీఎల్లో వాటా ఉపసంహరణ ద్వారా దేశీయ ఇంధన రంగంలో పోటీకి అవకాశం కల్పించినట్లవుతుందని కేంద్రం భావిస్తోంది.
బీపీసీఎల్ ఈక్విటీలో తన 52.98 శాతం వాటా విక్రయం ద్వారా సుమారు రూ.74,400 కోట్లు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రస్తుతం కంపెనీ షేరు మార్కెట్ ధర ప్రకారం చూస్తే ఈ వాటా విలువ రూ.47,430 కోట్లు మాత్రమే. దీనికి తోడు ప్రభుత్వ వాటా కొనే సంస్థ ఓపెన్ ఆఫర్ ద్వారా మరో 26 శాతం వాటాను మార్కెట్ నుంచి కొనాల్సి ఉంటుంది.
