Kuno National Park: చీతాల రాకపై స్థానికుల్లో ఆందోళన.. తమ ఊళ్లు ఏమవుతాయోనని భయపడుతున్న ప్రజలు
దేశంలోకి చీతాల రాకతో దేశ ప్రజలు సంతోషిస్తుంటే, కునో పార్కు సమీపంలోని ప్రజలు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. పార్కు కోసం తమ ఊళ్లను ఎక్కడ లాక్కుంటారో అని, దీనివల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని ప్రజలు భయపడుతున్నారు.
- Narender Thiru
- Published On : September 18, 2022 / 03:32 PM IST
Kuno National Park: దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత మన దేశంలోకి చీతాలు అడుగుపెట్టినందుకు ప్రజలు సంతోషిస్తుంటే, కునో పార్కు చుట్టు పక్కల ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతల్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మధ్య ప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Payyavula Keshav: త్వరలో నారా లోకేష్ పాదయాత్ర: పయ్యావుల కేశవ్
వీటి రాకతో పార్కు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరి కొందరు ప్రజలు మాత్రం తమకు ఉపాధి దొరుకుతుందని భావిస్తున్నారు. ఈ పార్కు పరిధిలోకి చీతాలు రావడంపై స్తానికులను ప్రశ్నించగా వాళ్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటికే కూనో నేషనల్ పార్కు కోసం 25 సమీప గ్రామాల్ని వేరే చోటుకు తరలించారు. 15 ఏళ్లుగా ఈ రకమైన తంతు కొనసాగుతోంది. గ్రామాలు, ప్రజల తరలింపు వల్ల మా ఆర్థిక పరిస్థితి దిగ జారింది. ప్రస్తుతం చిన్న పుడ్ స్టాల్ పెట్టుకుని బతుకుతున్నా. ఇప్పుడు మిగిలిన నాలుగైదు గ్రామాల్ని కూడా తరలిస్తే ఏమైపోతాం’’ అని రాధేశ్యామ్ అనే ఒక వ్యాపారి అన్నాడు.
మరో గ్రామస్తుడు మాట్లాడుతూ ‘‘గతంలోనే ఊరంతటిని పార్కు కోసం తరలించారు. ఇప్పుడు కునో నదిపై కటిలా ప్రాంతంలో ఒక డ్యామ్ రాబోతుంది. ఈ డ్యామ్ వల్ల చుట్టుపక్కల కనీసం 50 గ్రామాల ప్రజలపై ప్రభావం పడుతుంది. గ్రామాల్ని తరలిస్తే మా ఊరు ఒక్కటే ఇక్కడ మిగిలిపోతుంది. నిత్యావసరాలు, దుస్తులు, ఇతర వ్యాపారాలు చేసే వాళ్లు ఏమైపోతారు’’ అన్నాడు. ఇక్కడ పార్కును అభివృద్ధి చేయడం ద్వారా స్థానికేతరులు ల్యాండ్ కొనుక్కుని హోటల్స్, రెస్టారెంట్లు నిర్వహించుకుంటారు. దీని ద్వారా మా వ్యాపారాలు దెబ్బతింటాయి. అయితే, ఇక్కడ మౌలిక వసతులు మెరుగవుతాయి అని కొందరు ప్రజలు అంటున్నారు.
దీనివల్ల తమ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని కొందరు భావిస్తుంటే, మరికొందరు మాత్రం తమకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటున్నారు. చీతాల రాకతో ఈ ప్రాంతం పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందుతుందని, దీనివల్ల స్థానికులకు ఉపాధి దొరుకుతుందని నమ్ముతున్నారు.
