Arvind Kejriwal : జైల్లో కేజ్రీవాల్ ఆఫీసు ఏర్పాటుకు కోర్టును ఆశ్రయిస్తాం : భగవంత్ మాన్
Arvind Kejriwal : దోషిగా నిర్ధారించబడే వరకు జైలు నుంచి పనిచేయవచ్చని చట్టం చెబుతోంది. జైలులో కేజ్రీవాల్ కార్యాలయం ఏర్పాటుకు సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి అనుమతి కోరుతామని భగవంత్ మాన్ అన్నారు.
- Sreehari A
- Published On : March 23, 2024 / 08:12 PM IST
Will Seek Court's Permission To Set Up Office For Arvind Kejriwal In Jail
Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ను జైలుకు పంపితే.. ప్రభుత్వాన్ని నడపడానికి అక్కడే ఆయన కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు.
Read Also : Arvind Kejriwal ED Custody : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు బిగ్ షాక్.. ఈడీ కస్టడీకి అనుమతించిన కోర్టు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో కేజ్రీవాల్ స్థానాన్ని ఎవరూ తీసుకోలేరని ఆయన తేల్చిచెప్పారు. ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ ఆప్ చీఫ్ను అరెస్టు చేయడం, జ్యూడీషియల్ కస్టడీకి పంపితే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఎలా నడపగలరనే ప్రశ్నకు మాన్ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు. జైలు నుంచి ప్రభుత్వం నడపడరాదని ఎక్కడా రాయలేదని మాన్ పేర్కొన్నారు.
మరోవైపు.. మార్చి 28 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉంటే.. ఆయన్ను వెంటనే రాజీనామా చేయాల్సిందిగా బీజేపీ డిమాండ్ చేసింది. దీనిపై మాన్ మాట్లాడుతూ.. ‘ఆప్ అధినేత దోషిగా నిర్ధారించబడే వరకు జైలు నుంచి పని చేయవచ్చని చట్టం చెబుతోంది.
కేజ్రీవాల్ స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు :
జైలులో ఆఫీసు ఏర్పాటు చేయడానికి మేము సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి అనుమతి తీసుకుంటాం. ఆప్ ప్రభుత్వం పనిచేస్తుంది’ అని మాన్ చెప్పారు. ఆప్లో కేజ్రీవాల్ స్థానాన్ని ఎవరూ తీసుకోలేరని, ఎందుకంటే ఆయన అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పార్టీని స్థాపించారని, సీనియర్ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారని మాన్ స్పష్టం చేశారు.
