వేదమంత్రాలు అవపోసన పట్టిన మణిపూస : పెళ్లిళ్లు చేసే మహిళా పూజారి

చెన్నైలో జరిగిన ఓ పెళ్లి మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచింది. ఎందుకంటే ఆ పెళ్లిలో పౌరహిత్యం వహించింది ఓ మహిళా పూజారి. వేద మంత్రాలను అనర్గళంగా..స్పష్టంగా చదువుతూ ఓ ఓ జంటకు పెళ్లి చేసిన ఆ మహిళా పూజారి పేరు భ్రమరాంబ మహేశ్వరి. సాధారణంగా పెళ్లి తంతులో పౌరహిత్యం పురుషులే నిర్వహిస్తారు.కానీ ఓ మహిళ పెళ్లిలో పౌరహిత్యం చేస్తూ పెళ్లి చేయటం నేటి పితృస్వామ్య సమాజంలో పెద్ద విశేషమేమరి.
చెన్నై శివారు ప్రాంతమైన దక్షిణ చిత్రలో వేద మంత్రాలు చదువుతూ.. పెళ్లి వేడుకను అద్భుతంగా నిర్వహించారు భ్రమరాంబ మహేశ్వరి. తెలుగు అమ్మాయి సుష్మా హరిణి, తమిళ అబ్బాయి విఘ్నేశ్ రాఘవన్ల పెళ్లికి భ్రమరాంబ మహేశ్వరి పూజారిగా అన్ని కార్యక్రమాలు సక్రమంగా..సంప్రదాయం ప్రకారంగా చేయించటం స్థానికులను ఆశ్చర్యపరిచింది.
మైసూర్కు చెందిన భ్రమరాంబ వేద విద్యలో నిష్ణాతురాలు. గతంలోకూడా ఆమె చాలా పెళ్లిళ్లు చేశారు. వాస్తవానికి ఈ పెళ్లి కోసం మహిళా నాదస్వర, మృదంగ బృందాలను కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ వారికి ఆ బృందాలు దొరకలేదు. కానీ మహిళా పూజారి బ్రమరాంబ నిర్వహించిన పెళ్లి తంతు .. ఆ పెళ్లికి వచ్చిన అతిథులను..బంధుమిత్రులను ఎంతగానో ఆకట్టుకుంది. బ్రమరాంభ కేవలం మంత్రాలు చదివి పెళ్లిళ్లు చేయటమే కాదు ఆ మంత్రాలకు అర్థం కూడా చెబుతారు..వేదమంత్రాలు ఆమెకు కొట్టిన పిండి. చక్కటి ఉచ్ఛారణతో మంత్రాలు చదువుతూ..వాటికి అర్థం పరమార్థం చెబుతారు. అందుకే ఆమెతో పెళ్లిళ్లు చేయించుకోవటానికి ఎంతోమంది ఆసక్తి చూపిస్తుంటారు.
పూజారి తన మంత్రాలను ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి ఆ దంపతులకు వివరించారు. పెళ్లికి వచ్చిన అతిథులు.. పూజారి భ్రమరాంబ వివరాలు తెలుసుకున్నారు. తమ ఇంట్లో పెళ్లిళ్లు జరిగినప్పుడు సంప్రదిస్తామని తెలిపారు. మహిళా పూజారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో బ్రమరాంబను ఆహ్వానించినట్లు పెళ్లికూతురు సుష్మ తండ్రి సురేష్ రెడ్డి తెలిపారు.
అన్ని రంగాల్లోను తమదైన ముద్ర వేస్తు జయకేతనాలు ఎగురవేస్తున్న మహిళలు పాత సంప్రదాయాలకు స్వస్తి చెబుతున్నారు. మంత్రాలు..వేదాలు మహిళలు చదవకూడదు అనేది పాతకాలానికి చరమగీతంపాడుతూ..దేవాలయాల్లో పూజారులుగా కూడా సేవలందిస్తున్నారు. నింగీ నేలా మాదేనంటున్నారు. పెళ్లిళ్లు..అర్చకత్వాలు పురుషులే చేయాలను సంప్రదాయాలకు చెల్లుచీటి ఇచ్చి తమదైన ముద్ర వేస్తూ..మహిళా మణులు దూసుకుపోతున్నారు.