Yamuna River: యమునా మహోగ్రరూపం.. క్షణక్షణానికి పెరుగుతున్న నీటి మట్టం.. ఢిల్లీ సీఎం ఇంటి సమీపంలోకి వరద
గురువారం వరద ఉధృతి ఎక్కువ కావటంతో ఉదయం 8గంటలకు యమునా నీటి మట్టం 208.46 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం నీటిమట్టం ప్రమాదకరస్థాయి కంటే మూడు మీటర్ల ఎత్తులో ఉంది.
- Harishth Thanniru
- Published On : July 13, 2023 / 09:34 AM IST
Yamuna River
Delhi Floods: దేశ రాజధాని ఢిల్లీ వరదల్లో చిక్కుకుంది. ఢిల్లీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. యమునా నది ప్రవాహం అత్యంత భయానకంగా ఉంది. యుమునా నదిలో వరద ప్రవాహం డేంజర్ స్థాయిని దాటింది. బుధవారం అర్థరాత్రి వరకు యుమన నీటి మట్టం 208.05 మీటర్లకు చేరుకుంది. గురువారం వరద ఉధృతి ఎక్కువ కావటంతో ఉదయం 7గంటలకు యమునా నీటి మట్టం 208.46 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం నీటిమట్టం ప్రమాదకరస్థాయి కంటే మూడు మీటర్ల ఎత్తులో ఉంది. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నీటిని నదిలోకి విడుదల చేయడంతో వరద ఉధృతి పెరిగిందని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని బ్యారేజీ నుండి నీటి విడుదలను నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు. దీంతో కేంద్ర ఆమేరకు చర్యలు చేపట్టింది. హర్యానా బ్యారేజీ నుంచి మధ్యాహ్నం 2గంటల నుంచి నీటి ప్రవాహం తగ్గుతుందని కేంద్ర జల సంఘం తెలిపింది.
Yamuna River : ఈ రాత్రికి ఢిల్లీ మునిగిపోతుందా? అత్యంత భయానకంగా యమునా నది ప్రవాహం
వరదల కారణంగా అత్యంత దెబ్బతిన్న ప్రాంతాల్లో పాత ఢిల్లీ కూడా ఉన్నందున నిగంబోధ్ ఘాట్ శ్మశాన వాటికను ఉపయోగించవద్దని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కు చెందిన 12 బృందాలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి. యమునా నది నీటి మట్టం క్షణక్షణానికి పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరు జిల్లాలపై యమునా వరద ప్రభావం కనిపిస్తుంది. ఉత్తర ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ, షహదారా, సెంట్రల్ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ సౌత్ ఈస్ట్ ఢిల్లీలో వరద ప్రభావం కనిపించింది. యమునా పరివాహక ప్రాంతాల్లోని కాలనీల్లోకి వరదనీరు చేరడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 20వేల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో 46వేల మంది నివాసం ఉంటున్నట్లు సమాచారం. వారంతా ఇల్లు వదలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. యమునా నదిలో వరద ఉధృతికారణంగా జీటీకర్నాల్ రోడ్డు నీట మునిగింది. అదేవిధంగా యమున వరద నీరు ఔటర్ రింగ్ రోడ్డుపైకి చేరింది.
Yamuna River Floods : ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది..ఢిల్లీకి వరద ముప్పు
ముమునా వరద ఉధృతి నేపథ్యంలో గురువారం ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సమావేశాన్ని ఎల్జీ వీకే సక్సేనా ఏర్పాటు చేశారు. మరోవైపు గతంలో ఎన్నడూలేని విధంగా యమునా నది ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటివరకు యమునా నది నీటిమట్టం 1978లో నమోదైన 207.49 మీటర్లే గరిష్ట స్థాయి. తాజాగా ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ గురువారం ఉదయంకు యమునా నది నీటిమట్టం 208.05 మీటర్లకు చేరింది. వరద కారణంగా పలు రహదారులు, కాలనీలు నీట మునిగాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోని 10 పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం.
