Addanki Dayakar : రూ.25కోట్ల లొల్లి.. ఈటల ఆ ఆరోపణలు చేయడానికి కారణమిదే-అద్దంకి దయాకర్
Addanki Dayakar : అసెంబ్లీలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు.. నిన్ను పొగిడినప్పుడే నువ్వు ఏ పార్టీ తొత్తుగా ఉన్నావో అర్థమైంది. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
- Naveen
- Published On : April 23, 2023 / 09:08 PM IST
Addanki Dayakar(Photo : Google)
Addanki Dayakar : మునుగోడు ఉపఎన్నిక సమయంలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ రూ.25కోట్లు ఇచ్చింది అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల చేసిన ఆరోపణలపై ఇంకా దుమారం కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా ఈటలపై ఎదురుదాడికి దిగారు. ఈటలపై మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.. ఈటలపై ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డిని కంటతడి పెట్టించావు, మూల్యం చెల్లించక తప్పదని ఈటలకు వార్నింగ్ ఇచ్చారు అద్దంకి దయాకర్.
”ఈటల రాజేందర్.. నీ మాటలు, నీ ఆరోపణలతో మా అధ్యక్షుడు కన్నీరు పెట్టే వరకు తీసుకొచ్చావు. ఆధారాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడావ్. అసెంబ్లీలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు.. నిన్ను పొగిడి మాట్లాడినప్పుడే నువ్వు ఏ పార్టీ తొత్తుగా ఉన్నావో అర్థమైంది. అమిత్ షా, మోదీలు.. ఐటెం సాంగ్ లాగా తెలంగాణకు వచ్చిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న కొంతమందిని ఈటల కలిశారు. నువ్వు కూడా ఓడిపోతావని వారు చెప్పడంతో కంగుతిన్న ఈటల.. ఇలా రూ.25 కోట్ల ఆరోపణలు చేశారు.
రేవంత్ రెడ్డి బీర్ఎస్ పైన అలుపెరగని పోరాటం చేస్తున్నారు. బీజేపీని కాపాడుతున్నదే కేసీఆర్. కేసీఆర్ ను కాపాడుతున్నదే మోదీ, షా. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ వేర్వేరు కావు. ఆ రెండు పార్టీలపైనా పోరాటం చేస్తున్నాం. రేవంత్ రెడ్డికి తెలంగాణ సమాజం యావత్తు అండగా ఉంటుంది. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మూల్యం చెల్లించాల్సి వస్తుంది” అని ఈటలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అద్దంకి దయాకర్.
ఈటల-రేవంత్ రెడ్డి వ్యవహారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సైతం తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. ఈటలపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ అవినీతిలో ఈటల రాజేందర్ భాగస్వామి అని భట్టి ఆరోపించారు. ఈటల చేసిన తప్పుడు పనులను కప్పిపుచ్చడానికే కాంగ్రెస్ పై అభాండాలు వేస్తున్నారని, రేవంత్ రెడ్డిపైనా ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. మునుగోడు వివాదం బీజేపీ, బీఆర్ఎస్ అజెండాలో భాగమే అని భట్టి ఆరోపించారు. ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
