ఏప్రిల్ 1, 2020 నుంచి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సింగా అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 19న ఆయన పౌర సరఫరాల శాఖపై తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లాలో అమలవుతున్న నాణ్యమైన బియ్యం పంపిణీపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజల నుంచి స్పందన బాగుందని అధికారులు సీఎంకు చెప్పారు. ఏఫ్రిల్ 1 నుంచి అన్ని జిల్లాలకు వర్తింపు చేసేలా కార్యాచరణను సిద్ధం చేయాలని, ప్రజలు తినగలిగే నాణ్యమైన బియ్యాన్ని సేకరించేలా ఇప్పటి నుంచే ప్రణాళిక వేసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు.
రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న సంచులను రీసైక్లింగ్ కోసం తిరిగి వెనక్కి ఇచ్చేలా ప్రజలకు అవగాహన కలిగించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే డిసెంబర్లో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులకు సూచించారు.