Balka Suman : కాంగ్రెస్లో ఎస్సీ, ఎస్టీలపై తీవ్ర వివక్ష చూపుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి పైసలిచ్చి పీసీసీ చీఫ్ అయ్యారంటూ నాడు కోమటిరెడ్డి సోదరులు, జగ్గారెడ్డి ప్రచారం చేశారని ఆయన అన్నారు. ఓటుకు నోటు కేసులో ఉన్న వ్యక్తికి పీసీసీ చీఫ్ ఎలా ఇస్తారంటూ వారు నిలదీశారని చెప్పారు. రేవంత్ పీసీసీ చీఫ్గా ఉంటే తాము పార్టీలో ఉండబోమని కోమటిరెడ్డి సోదరులు అధిష్టానానికి హెచ్చరికలు చేశారని తెలిపారు. ఇంత చేసినా.. వీరిపై ఎలాంటి క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు లేవన్నారు. కారణం వారంతా రేవంత్ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు కావడమే అన్నారు.
పార్టీ కోసం పని చేసిన వారికి న్యాయం చేయాలని అడిగినందుకు దళితుడైన బక్క జడ్సన్పై వేటు వేశారని బాల్క సుమన్ వాపోయారు. బడుగు, బలహీనవర్గాలకు న్యాయం చేయాలని కోరినందుకు క్రమశిక్షణ ఉల్లంఘించారని ఆయనపై పార్టీ సీరియస్ అయ్యిందన్నారు. దీనికి కారణం బక్క జడ్సన్ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వాడు కావడమే అన్నారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సామాజికవర్గం వాళ్ళు ఏది చేసినా నడిచిపోతుంది.. కానీ ఎస్సీలు ఒక్కమాట అన్నా ఓర్వలేరు. ఇదేనా కాంగ్రెస్ పాటించే సామాజిక న్యాయం? ఇదేనా కాంగ్రెస్లో ఎస్సీ, ఎస్టీలకు దక్కే గౌరవం? అని ప్రశ్నించారు బాల్క సుమన్.
Also Read : పెద్దపల్లిలో బస్తీమే సవాల్.. ఈ ముగ్గురిలో విక్టరీ కొట్టేదెవరు?