Telangana National Integration Day
Telangana National Integration Day: తెలంగాణ ఉద్యమంలో తాను లక్ష్య సాధన కోసం మరణం అంచులదాకా వెళ్లేందుకు సిద్ధపడ్డానని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన కేసీఆర్, అనంతరం మాట్లాడారు. ‘‘మిగులు నిధులతో కూడిన నాటి హైదరాబాద్ రాష్ట్రం ఆనాడే అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని, అడుగులు వేయటం ప్రారంభించింది.1956లో దేశంలో జరిగిన రాష్ట్రాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా.. తెలంగాణ ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ-ఆంధ్రలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటినుండి తెలంగాణ ప్రజలలో తాము మోసపోయినామనీ, తాము దోపిడీకి గురువుతున్నామనే ఆందోళన గూడు కట్టుకుంది’’ అని చెప్పారు.
‘‘ఇరుప్రాంతాల మధ్య భావ సమైక్యత చోటు చేసుకోలేదు. సఖ్యత ఏర్పడలేదు. అందువల్లనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దశాబ్దకాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడింది. సమస్యను పరిష్కరించాల్సిన ఆనాటి కేంద్రప్రభుత్వం అందుకు భిన్నంగా సాచివేత ధోరణిని అవలంభించింది. తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్షను పట్టించుకోకుండా గాలికొదిలేసింది. తెలంగాణ ప్రజలు భయపడినట్లుగానే సమైక్య రాష్ట్రంలో అన్నిరంగాల్లో దారుణమైన వివక్ష అమలైంది. ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష క్రమేపీ బలపడుతూ వచ్చింది. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నేనే స్వయంగా సారథ్యం వహించి, ఉద్యమశంఖం పూరించాను.
తెలంగాణ ప్రజలందరినీ ఒక్కటిచేసి, పద్నాలుగేళ్లు అవిశ్రాంత పోరాటాన్ని నడిపించాను. లక్ష్య సాధన కోసం మరణం అంచులదాకా వెళ్లేందుకు సిద్ధపడ్డాను. తెలంగాణ ఉద్యమం అంతకంతకూ తీవ్రం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం దిగివచ్చింది. ప్రజా ఉద్యమం ఆశించిన గమ్యాన్ని ముద్దాడింది. 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది. తెలంగాణ ఏవిధంగానైతే ఉండాలని ప్రజలు స్వప్నించారో, సంభావించారో.. అదేవిధంగా నేడు తెలంగాణ అన్నిరంగాల్లోనూ అగ్రగామి రాష్ట్రంగా పురోగమిస్తున్నది. రాష్ట్రం ఏర్పడిననాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ పురోగమించి.. దేశానికే దారిచూపే టార్చ్ బేరర్ గా నిలిచింది. విద్యుత్తు, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, ప్రజా సంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాలలో అనతికాలంలోనే అద్భుతాలను ఆవిష్కరించి దేశానికే దిశానిర్దేశనం చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అవలంబించిన ప్రగతిశీల, పారదర్శక విధానాల వల్ల రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగింది’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
‘‘2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జీఎస్డీపీ 5 లక్షల 5 వేల 849 కోట్ల రూపాయలు కాగా, 2021-22 నాటికి 11 లక్షల 54 వేల 860 కోట్ల రూపాయలకు పెరిగింది. తలసరి ఆదాయం పెరుగుదలలోనూ తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటును అధిగమించింది. 2014-15 లో రాష్ట్ర తలసరి ఆదాయం లక్షా 24 వేల 104 రూపాయలు కాగా, 2021-22 నాటికి 2 లక్షల 78 వేల 833 రూపాయలకు పెరిగింది. జాతీయ సగటు కన్నా మన రాష్ట్ర తలసరి ఆదాయం 86 శాతం అధికం కావడం మనందరికీ గర్వకారణం. సంపదను పెంచాలి.. పేదలకు పంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. అనేకరకాల సంక్షేమ పథకాల ద్వారా ఏటా 50 వేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తున్నది.
పేద, బలహీన వర్గాల ప్రజలకు జీవన భద్రతను కల్పిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకున్న ఉద్దీపన చర్యల ఫలితంగా వ్యవసాయం విస్తరించడమేగాకుండా, వ్యవసాయోత్పత్తులు కనీవినీ ఎరుగని స్థాయిలో పెరిగిపోయాయి. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత కేవలం ఆరునెలల వ్యవధిలోనే అన్నిరంగాలకు 24 గంటలు నిర్విరామంగా, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నది. నేడు దేశంలో అన్నిరంగాలకూ 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ కావడం మనందరికీ గర్వకారణం. తెలంగాణ ప్రభుత్వం చేసిన నిర్విరామ కృషి ఫలితంగా నేడు రాష్ట్రంలో దాదాపు కోటి ఎకరాలకు సాగునీటి సదుపాయం కలిగించింది. కరువు కాటకాలతో విలవిల్లాడిన తెలంగాణ నేడు సస్యశ్యామల తెలంగాణగా అవతరించింది’’ అని కేసీఆర్ చెప్పారు.
‘‘రైతు రుణమాఫీతోపాటూ రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల ద్వారా రైతన్నల గుండెల్లో విశ్వాసం నింపింది. పంటల దిగుబడి విపరీతంగా పెరిగి వ్యవసాయ సమృద్ధితో తెలంగాణ.. దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా అవతరించింది. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన రక్షిత జలాలను నల్లాల ద్వారా ఉచితంగా అందిస్తూ తెలంగాణ.. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. గురుకుల ఆవాసీయ విద్యలో దేశంలో తెలంగాణదే అగ్రస్థానం. 1,011 గురుకుల విద్యాలయాలున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఈ గురుకులాల్లో ఐదున్నర లక్షల మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యాబోధన జరుగుతున్నది. గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ప్రతిఏటా లక్షా 25 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నది. వైద్య ఆరోగ్యరంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించింది.
ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసే యజ్ఞం కొనసాగుతున్నది. రాష్ట్రంలో తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – టిమ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతోపాటు, వరంగల్ నగరంలో మరొక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రభుత్వం నిర్మిస్తున్నది. హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో మరో 2 వేల పడకలను ప్రభుత్వం అదనంగా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. వీటితోపాటు పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు – పల్లె దవాఖానాలు చక్కని సేవలందిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వినూత్నమైన పథకం.. తెలంగాణకు హరితహారం. గత ఏడు సంవత్సరాలుగా ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం 7.7 శాతానికి పెరిగినట్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొన్నది’’ అని కేసీఆర్ తెలిపారు.
‘‘నేడు రాష్ట్రంలో ఎటు చూసినా పచ్చదనం కనువిందు చేస్తున్నది. అడవుల పునరుద్ధరణతో పాటు సామాజిక వనాల పెంపకం, వాటి సంరక్షణ ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతున్నది. హరితవనాల అభివృద్ధి కోసం నూతనంగా అటవీ విశ్వవిద్యాలయాన్ని సైతం తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పుతున్నది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హరిత నిధిని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం నూతన ఒరవడిని సృష్టించింది. ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణకు హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి, ఈ హరితక్రాంతి నిరంతర స్రవంతిగా కొనసాగడం కోసం గ్రీన్ ఫండ్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల అందరికి భాగస్వామ్యం కల్పిస్తూ వారందించే విరాళాల ఆధారంగా గ్రీన్ ఫండ్ ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలు సైతం తమ బడ్జెట్లో 10 శాతం విధిగా గ్రీన్ బడ్జెట్ కింద కేటాయిస్తున్నాయి.
ప్రశాంతమైన, సురక్షితమైన, ప్రగతిశీల వాతావరణం ఉన్నచోటనే పారిశ్రామిక అభివృద్ధి పరుగులు తీస్తుంది. అందుకు నిజమైన నిదర్శనం మన తెలంగాణ రాష్ట్రం. సుస్థిర పాలన, మెరుగైన శాంతిభద్రతలు, అవినీతికి, అలసత్వానికి ఆస్కారంలేని విధంగా రూపొందించిన టీఎస్-ఐపాస్ పారిశ్రామిక విధానం, ఈ మూడింటి వల్ల తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక రంగంలో ఈ ఎనిమిదేళ్లలో 2 లక్షల 32 వేల 111 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చాయి. 16 లక్షల 50 వేల ఉద్యోగాల కల్పన జరిగింది. ఐటీ రంగంలో తెలంగాణ సాటిలేని ప్రగతిని సాధిస్తూ పురోగమిస్తున్నది. 2014లో తెలంగాణ ఐటీరంగ ఎగుమతుల విలువ 57 వేల 258 కోట్లు మాత్రమే ఉండగా, తెలంగాణ ప్రభుత్వ కృషితో 2021 నాటికి లక్షా 83 వేల 569 కోట్లకు పెరిగింది’’ అని కేసీఆర్ అన్నారు.
‘‘ఐటీ రంగ ఎగుమతుల్లో దేశం వృద్ధిరేటు 17.20 మాత్రమే ఉండగా, తెలంగాణ వృద్ధి రేటు 26.14 శాతంగా ఉండటం మన రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింప చేస్తున్నది. ఐటీ ఉద్యోగాల సృష్టిలో మొన్నటివరకూ దేశంలోనే ప్రథమస్థానంలో ఉన్న కర్ణాటకను తెలంగాణ రాష్ట్రం అధిగమించింది. ఈ ఎనిమిదేళ్లలో ఐటీ రంగంలో 7 లక్షల 80 వేల ఉద్యోగాల కల్పన జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ జీవన ప్రమాణాలను పెంచడంలో సఫలీకృతమైంది. నేడు రాష్ట్రంలోని అన్ని గ్రామాలకూ చక్కని మౌలిక వసతులు సమకూరాయి. ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరును కలిగి ఉంది. అదేవిధంగా ప్రతి గ్రామంలో డంపుయార్డు, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామాలు ఏర్పాటయ్యాయి.
యువతకు మానసికోల్లాసంతో పాటు దేహధారుఢ్యం కూడా పెంపొందడానికి క్రీడలు ఎంతగానో తోడ్పడుతాయి. పల్లె-పట్టణ ప్రగతిలో భాగంగా యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు శరవేగంగా ఏర్పాటవుతున్నాయి.ప్రభుత్వ కృషితో పరిశుభ్రమైన పచ్చని పల్లెలు రూపుదిద్దుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం అందించే అవార్డులు వరుసపెట్టి తెలంగాణ గ్రామాలను వరించడం మనందరికీ గర్వకారణం. అపూర్వమైన ఫలితాలను సాధించిన పల్లె-పట్టణ ప్రగతి కార్యక్రమం యావత్ దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. ఎనిమిదేళ్లలో తెలంగాణ జీవన ముఖచిత్రం ఎంతగానో మారిపోయింది. పచ్చని పొలాలతో, చక్కని మౌలిక వసతులతో శాంతికి నెలవుగా తెలంగాణ అలరారుతున్నది’’ అని కేసీఆర్ చెప్పారు.
సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ రాష్ట్రం ప్రగతిబాటలో పయనిస్తున్నది. ఈ తరుణంలో మతతత్వ శక్తులు బయలుదేరి తమ వికృత ప్రయత్నాలతో తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఏ దేశమైనా, ఏ సమాజమైనా తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ, వాటిలోని మంచి చెడులను అర్ధం చేసుకుంటూ అప్రమత్తంగా ముందడుగు వేయాలి. ఏ కొంచెం ఆదమరిచినా ఎంతటి బాధాకరమైన, దౌర్భాగ్యమైన పరిస్థితులు సంభవిస్తాయో తెలుసుకోవడానికి మన తెలంగాణే మనకు ఉదాహరణ. ఒకనాడు జరిగిన ఏమరుపాటు వల్ల తెలంగాణ 58 సంవత్సరాలు శాపగ్రస్త జీవితం అనుభవించింది. తాను కోల్పోయిన అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవడం కోసం ఎంతో పోరాడాల్సి వచ్చింది. ఎంతోమంది జైలుపాలు కావలసి వచ్చింది, ఎన్నోజీవితాలు ఆహుతై పోవాల్సి వచ్చింది. ఆ చరిత్రంతా నేను వేరే చెప్పనక్కరలేదు. అది మనందరి ప్రత్యక్ష అనుభవం. సమీప చరిత్రలోనే జరిగిన తెలంగాణ ఉద్యమంలో మనమందరం ప్రత్యక్ష భాగస్వాములమే. హక్కుల కోసం, అస్తిత్వం కోసం తెలంగాణ సమాజం అనుభవించిన ఘర్షణను తలచుకుంటే నేటికీ నా కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి. అటువంటి కష్టం, అటువంటి వేదన పొరపాటున కూడా మళ్లీ రాకూడదు. అందుకు నిశిత పరిశీలన, నిరంతర చైతన్యం కావాలి’’ అని కేసీఆర్ అన్నారు.
మతోన్మాదశక్తులు పేట్రేగి పోతున్నాయి
దేశంలోనూ, రాష్ట్రంలోనూ మతోన్మాదశక్తులు పేట్రేగి పోతున్నాయని కేసీఆర్ అన్నారు. ‘‘తమ సంకుచిత ప్రయోజనాల కోసం సామాజిక సంబంధాల నడుమ ముళ్లకంపలు నాటుతున్నాయి. విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయి. మనుషుల మధ్య ఈ రకమైన విభజన ఏ విధంగానూ సమర్థనీయం కాదు. మతం చిచ్చు ఈ విధంగానే విజృంభిస్తే అది దేశం యొక్క, రాష్ట్రం జీవికనే కబళిస్తుంది. మానవ సంబంధాలనే మంట గలుపుతుంది. జాతి జీవనాడిని కలుషితం చేస్తుంది.
జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు ఈ విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయి. ఆనాటి చరిత్రతో, పరిణామాలతో వీసమెత్తు సంబంధంలేని ఈ అవకాశవాదులు, ఆషాడ భూతులు చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అత్యంత మేధో సంపత్తితో, క్రియాశీలతతో చురుకుగా స్పందించే తెలంగాణ సమాజం.. తన బుద్ధి కుశలతను ప్రదర్శించి స్వరాష్ట్రాన్ని సాధించుకుంది. అదే క్రియాశీలతను, బుద్ధి కుశలతను మరోమారు చూపించాలి. జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న ఈ దుష్ట, భ్రష్ట శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాలి. ఈ విషయంలో రెప్పపాటు కాలం ఆదమరిచినా సమాజం కల్లోలంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని మరోమారు హెచ్చరిస్తున్నాను’’ అని చెప్పారు.
‘‘మీ అందరి అండదండలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తిగా, అనునిత్యం తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా, ఈ నేల పై నెలకొన్న శాంతి, సౌభ్రాతృత్వాలను గుండెల నిండా శ్వాసించే వ్యక్తిగా.. ప్రతీ క్షణం ప్రజాశ్రేయస్సు కోసమే పరితపించే వ్యక్తిగా, అన్నింటికి మించి మీ బిడ్డగా ఈ విషయం మీకు చెప్పడం నా కర్తవ్యం. నా గురుతర బాధ్యత. మీ అందరికీ వినమ్రంగా చేతులు మోడ్చి నమస్కరిస్తూ నేను కోరుకునేది ఒక్కటే.. ఎన్నటికీ ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలే తప్ప, అశాంతి, అలజడులతో అట్టుడికి పోవద్దు. తిరిగి తెలంగాణ మరో కల్లోలంలోకి జారిపోవద్దు. తెలంగాణ ఈనాడు ఎంత వేగంగా పురోగమిస్తున్నదో.. అంతేవేగంతో రాబోయే రోజుల్లోనూ అప్రతిహతంగా అభివృద్ధి పథంలో దూసుకు పోవాలి. జాతినిర్మాణంలో ఉజ్వల పాత్రను నిర్వహించాలి. భారత జాతి జాగృతి కోసం, అభ్యున్నతి కోసం మనవంతు దోహదం చేద్దామని అందరినీ కోరుకుంటూ మరోమారు యావత్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని కేసీఆర్ అన్నారు.
India’s Active caseload: దేశంలో కొత్తగా 5,747 మందికి కరోనా.. ప్రస్తుతం 46,848 యాక్టివ్ కేసులు