Maharashtra Politics: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతు పట్టడం లేదు. పవార్ నిజంగానే పార్టీ నుంచి వైదొలిగే ఉద్దేశంతో రాజీనామా చేశారా? లేదంటే పార్టీలో పెరిగిన అసమ్మతిని అణచివేసేందుకు రాజీనామా అనే అంశంపై వాడీవేడిగా చర్చ జరుగుతోంది. తాజాగా ఎన్సీపీ నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఏర్పాటు చేసిన పార్టీ కమిటీ తీసుకున్న నిర్ణయం ఈ అనుమానాలకు ఇంకా బలం చేకూరుస్తోంది. నూతన అధ్యక్షుడి ఎన్నిక పక్కన పెట్టి.. శరద్ పవార్ రాజీనామానే ఆ కమిటీ తిరస్కరించింది. ఆయన స్థాపించిన పార్టీకి ఆయనే నాయకత్వం వహించాలని, అధ్యక్ష పదవిలో కొనసాగాలని కోరుతూ ఓ తీర్మానాన్ని ఆమోదించింది.
ఆయన రాజీనామా తర్వాత ఆయన వారసుని ఎంపిక కోసం ఏర్పాటైన కోర్ కమిటీ సమావేశంలో ఈ తీర్మానం చేయడం గమనార్హం. ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ ఈ సమావేశం వివరాలను శుక్రవారం మీడియాకు తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలనే శరద్ పవార్ కోరికను తాము ఏకాభిప్రాయంతో తిరస్కరించామని చెప్పారు. అంతే కాకుండా పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగాలని ఆయనను కోరాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేసిన తర్వాత దేశంలోని అనేక పార్టీల నేతలు ఆయనను సంప్రదించారని తెలిపారు. ఆయన కుమార్తె సుప్రియ సూలేతోపాటు తాను కూడా తమ అభిప్రాయాలను ఆయనకు చెప్పామన్నారు.
పవార్ నిర్ణయంపై పార్టీ కేడర్ చాలా విచారంగా ఉన్నారని, వారి మనసు గాయపడిందని, తలక్రిందులయ్యారని ప్రఫుల్ పటేల్ చెప్పారు. ఈ విషయాలను మనం పట్టించుకోకుండా ఉండకూడదన్నారు. తమను విశ్వాసంలోకి తీసుకోకుండా పవార్ నిర్ణయం తీసుకున్నారన్నారన్న ఆయన.. పార్టీ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునే బాధ్యతను తమకు ఆయన అప్పగించారని పేర్కొన్నారు. తాము శుక్రవారం సమావేశమై పవారే అధ్యక్ష పదవిలో కొనసాగాలని ఏకగ్రీవంగా తీర్మానించామని తెలిపారు. కాగా, ఈ సమావేశంలో ఎన్సీపీ నేతలు అజిత్ పవార్, సుప్రియా సూలే సైతం పాల్గొన్నారు.