ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి సీనియర్ నాయకుడు సాకే శైలజానాధ్ నియమితులయ్యారు. 2019 లో జరిగినసార్వత్రిక ఎన్నికల తర్వాత అధ్యక్ష పదవికి రఘువీరా రెడ్డి రాజీనామా చేశారు అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉన్నారు. గత కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్న పీసీసీ అధ్యక్ష పదవి రేసులో కొందరు సీనియర్ల పేర్లు వినిపించినప్పటికీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సీనియర్ నేత శైలజానాధ్ కి బాధ్యతలు అప్పచెప్పారు. దీంతో పాటు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా సీనియర్ నేతలు నర్రెడ్డి తులసి రెడ్డి. మస్తాన్ వలీకి బాధ్యతలు అప్పచెప్పారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
గత కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్న ఏపీసీసీఅధ్యక్ష పదవి మరోసారి కూడా అనంత జిల్లా వాసికే దక్కింది. గతంలో పీసీసీఅధ్యక్షుడిగా పని చేసిన రఘువీరా రెడ్డి బీసీ వర్గానికి చెందిన నేత. రాష్ట్ర విభజన తర్వాత రఘువీరా రెడ్డి ఏపీసీసీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన కొద్ది నెలల క్రితం తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం పీసీసీ పగ్గాలు మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజుకు అప్పగిస్తారని ఫ్రచారం జరిగినా అది జరగలేదు. మరో వైపు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరటంతో ఆయన్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన ఆ బాధ్యతలు తీసుకోటానికి ముందుక రాకపోవటంతో తిరిగి అనంతపురానికే చెందిన దళిత నేత మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాధ్ ను వరించింది.