Maharashtra Politics: చెత్త రాజకీయాలు.. శరద్ పవార్ రాజీనామాపై సంజయ్ రౌత్ భిన్న స్పందన
ఒకప్పుడు బాలాసాహేబ్ థాకరే సైతం రాజీనామా నిర్ణయం తీసుకున్న విషయాన్ని శివసేన (ఉద్ధవ్ బాలాసాహేబ్ థాకరే) సీనియర్ నేత సంజయ్ రౌత్ గుర్తు చేశారు. ప్రస్తుతం శరద్ పవార్ సైతం అలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. అయితే అప్పట్లో శివసైనికుల విజ్ణప్తి మేరకు..
- tony bekkal
- Published On : May 2, 2023 / 04:05 PM IST
Sanjay Raut and Sharad Pawar
Maharashtra Politics: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనే కీలక నేతల్లో ఒకరైన శరద్ పవార్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం తన ఆత్మకథ పుస్తకం రెండో భాగం విడుదల కార్యక్రమంలో పవార్ పాల్గొని పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక నుంచి ఎన్నికల్లో పోటీ చేయబోనని అన్న ఆయన.. పార్టీ తదుపరి అధ్యక్ష పదవి కోసం పార్టీలోని సీనియర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పవార్ వెల్లడించారు.
కాగా, పవర్ తీసుకున్న ఈ నిర్ణయంపై శివసేన (ఉద్ధవ్ బాలాసాహేబ్ థాకరే) సీనియర్ నేత సంజయ్ రౌత్ భిన్నంగా స్పందించారు. చెత్త రాజకీయాలు, ఆరోపణలతో విసిగిపోయి ఒకప్పుడు బాలాసాహేబ్ థాకరే సైతం రాజీనామా నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం శరద్ పవార్ సైతం అలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. అయితే అప్పట్లో శివసైనికుల విజ్ణప్తి మేరకు తన నిర్ణయాన్ని బాలాసాహేబ్ వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. శరద్ పవార్ సైతం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే అర్థంలో ఆయన చెప్పుకొచ్చారు.
మంగళవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంజయ్ రౌత్ స్పందిస్తూ ‘‘చెత్త రాజకీయాలు, విపరీమైన ఆరోపణల కారణంగా ఎంతగానో విసిగిపోయిన శివసేన సుప్రెమో బాలాసాహేబ్ థాకరే సైతం పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్నట్లు అప్పట్లో ప్రకటించారు. చరిత్ర తనకు తానే పునరావృతం చేసుకుంటున్నట్లు అనిపిస్తోంది. కానీ శివసైనికుల ప్రేమ కారణంగా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది’’ అని రాసుకొచ్చారు. ఇక చివర్లో ‘‘బాలాసాహెబ్ లాగానే పవార్ సాహెబ్ కూడా రాష్ట్ర రాజకీయాలకు ఆత్మ’’ అని సంజయ్ రౌత్ అన్నారు.
శరద్ పవార్కు ప్రస్తుతం 82 ఏళ్లు. 24 ఏళ్లుగా ఆయన ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ విషయంపై శరద్ పవార్ మాట్లాడుతూ.. ‘‘నేను అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 24ఏళ్లు. 1960 మే 1 నుంచి నా ప్రజాజీవన యాత్ర ప్రారంభమైంది. గత 63 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతోంది. మహారాష్ట్రలో, దేశంలో విభిన్న స్థానాల్లో పనిచేశాను. నా రాజ్యసభ పదవీకాలం మూడేళ్లు మిగిలి ఉంది. ఈ సమయంలో నేను ఎటువంటి పదవులు తీసుకోకుండా మహారాష్ట్ర, దేశానికి సంబంధించిన సమస్యలపై దృష్టిపెడతాను’’ అని శరద్ పవార్ అన్నారు.
