Tamil Nadu Politics: డీఎంకే, బీజేపీ మధ్య వార్ పీక్స్.. సీఎం స్టాలిన్కు చెప్పాపెట్టకుండా మంత్రి బాలాజీని తొలగించిన గవర్నర్
డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్ కార్యాలయానికి మధ్య నెలల తరబడి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అనేక విషయాలపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన చట్టానికి గవర్నర్ ఆమోదం నిరాకరించడం ఈ పరిస్థితిని మరింత విషమానికి తీసుకెళ్లింది
- tony bekkal
- Published On : June 29, 2023 / 08:46 PM IST
Governor RN Ravi: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య చాలా రోజులుగా ఉప్పనిప్పుగా ఉన్నాయి పరిస్థితులు. ఈ తరుణంలో గవర్నర్ తీసుకున్న తాజా నిర్ణయం ఒకటి ఈ పరిస్థిపై పెట్రోల్ చల్లినట్టైంది. ఒక కుంభకోణం కేసులో తీవ్రమైన క్రిమినల్ దర్యాప్తును ఎదుర్కోవడమే కాకుండా ప్రస్తుతం జైలులో ఉన్న మంత్రి వి సెంథిల్ బాలాజీని సీఎం స్టాలిన్కు చెప్పాపెట్టకుండా మంత్రివర్గం నుంచి తొలగించారు గవర్నర్ రవి.
గురువారం చెన్నైలోని రాజ్ భవన్ నుంచి వెలువడిన ఒక అధికారిక ప్రకటనలో.. ‘‘మంత్రి బాలాజీ ఉద్యోగాల కోసం లంచం తీసుకోవడంతో సహా ఇతర మనీలాండరింగ్, అవినీతి కేసులలో తీవ్రమైన క్రిమినల్ ప్రొసీడింగ్లను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ సెంథిల్ బాలాజీని గవర్నర్ మంత్రి మండలి నుంచి తొలగించారు’’ అని పేర్కొన్నారు. కాగా, గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టులో సవాలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం యోచిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ పర్యటన వేళ ట్రాఫిక్ మళ్లింపులు.. ఇలా వెళ్లండి..
ఈ నెల ప్రారంభంలో బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అనంతరం ఆయన జ్యుడీషియల్ కస్టడీని చెన్నైలోని కోర్టు బుధవారం జూలై 12 వరకు పొడిగించింది. ఈ తీర్పుకు కొన్ని గంటల ముందు, సుప్రీంకోర్టు ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడానికి అనుమతించింది. అక్కడ ఆయనకు గుండె శస్త్రచికిత్స జరిగింది. కొంత కాలం నుంచి ఆయన ఛాతీ నొప్పి సహా ఇతర అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతి చర్చలో మహిళా రిజర్వేషన్లను లేవనెత్తిన శరద్ పవార్
డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్ కార్యాలయానికి మధ్య నెలల తరబడి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అనేక విషయాలపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన చట్టానికి గవర్నర్ ఆమోదం నిరాకరించడం ఈ పరిస్థితిని మరింత విషమానికి తీసుకెళ్లింది. గవర్నర్ రవి రాజ్యాంగ విరుద్ధమైన ప్రవర్తిస్తున్నారని, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గణనీయమైన సంఖ్యలో సంతకం చేయడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ డీఎంకే గత సంవత్సరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పిటిషన్ దాఖలు చేసింది.
రాజకీయంగా క్రియాశీలకంగా మారిన గవర్నర్ పదవిని నిలిపివేయాలని డీఎంకే చాలా కాలంగా వాదిస్తోంది. ప్రత్యేకించి వారి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్న తీరును ‘రాజ్యాంగ వక్రబుద్ధి’గా డీఎంకే విమర్శలు గుప్పించింది. ఒక్క తమిళనాడు రాష్ట్రమే కాకుండా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు గవర్నర్లకు మధ్య ఉద్రిక్త వాతావరణమే నడుస్తోంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో ఈ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
