Tamilnadu Politics: తమిళనాడు పేరు మార్చాలంటూ కొంత కాలం క్రితం ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రాన్ని తీవ్రంగా కుదిపివేసింది. తమిళ జనం కోపంతో గవర్నర్ మీద నిప్పులు చెరిగారు. ఈ వ్యతిరేకతను తట్టుకోలేక ఆయన తర్వాత క్షమాపణ చెప్పారు. కానీ తరుచూ ఏదో వివాదాలతో మాత్రం ఆయన ఎప్పుడూ చర్చలోనే ఉంటున్నారు. ముఖ్యంగా తమిళ్, ద్రవిడ ఐడెంటిటీల మీద ఆయన వివాదాలు కొనసాగుతున్నాయి. తాజా అలాంటి వివాదమే మరోసారి నెత్తికెత్తుకున్నారు.
ద్రవిడ పాలన అనేది కాలం చెల్లిన సిద్ధాంతం అంటూ గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యలు తమిళులను మరోసారి ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘ద్రవిడ పాలన అనేది ఏక భారతం సమైక్య భారతం అనే సిద్ధాంతానికి వ్యతిరేకం. భాషకు అంటరానితనాన్ని అంటగడుతోంది. రాష్ట్రంలో తమిళం, ఆంగ్ల భాషలు మినహా ఇతర భాషలకు అనుమతి లేదు. అలాంటి ద్రావిడ తరహా పాలనకు మద్దతివ్వలేను’’ అని అన్నారు.
అంతే కాదు.. వాస్తవానికి ఇది శాసనసభలో ఇచ్చిన ప్రసంగంలోనే చెప్పాలని, కానీ ఆ సమయంలో ఈ పదాన్ని మినహాయించానంటూ గవర్నర్ వెల్లడించారు. రాష్ట్రంలో ద్రావిడ తరహా పాలన అందిస్తున్నామంటూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రతి సభలో చెప్తున్నారు. కాగా, స్టాలిన్ చేస్తున్న ప్రచారానికి పూర్తి వ్యతిరేకంగా గవర్నర్ ప్రకటన ఉంది. స్టాలిన్ టార్గెట్ గానే గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారన్నవారు లేకపోలేదు. ఇక ప్రభుత్వం తనపై చేస్తున్న ఆరోపణలను గవర్నర్ రవి తోసిపుచ్చారు. డీఎంకే ప్రభుత్వం బిల్లులను తాను పెండింగ్లో ఉంచలేదని, రాజ్యాగం ధర్మాసనానికి కట్టుబడే తన విధులను నిర్వర్తిస్తున్నానంటూ పలు అంశాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు వ్యక్తం చేశారు.
Maharashtra Politics: ఎన్సీపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం శరద్ పవార్ నియమించిన కమిటీ వింత నిర్ణయం
‘‘శాసనసభలో పాలకులు అందించిన ప్రసంగ పాఠంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు భేషుగ్గా ఉన్నాయి. అయితే రాష్ట్రంలో పాపులర్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థలకు నిధులు పంపిణీ, కళ్లకుర్చి సంఘటనను ప్రస్తావిస్తూ ప్రసంగించాను. గవర్నర్ ప్రసంగంలో ద్రావిడ తరహా పాలనను పొగుడుతూ మాట్లాడాలని పాలకులు ఆశించారు. ద్రావిడ తరహా పాలన అంటూ ఏదీ లేదు. ఆ తరహా సిద్ధాంతాలన్నీ కాలం చెల్లిపోయాయి. వాటికి మళ్ళీ ప్రాణం పోయాలని అనుకుంటున్నారు’’ అని గవర్నర్ విరుచుకుపడ్డారు. అంతే కాకుండా ద్రావిడ తరహా సిద్ధాంతం దేశ స్వాతంత్య్ర సంగ్రామాన్ని తక్కువగా అంచనావేస్తుందన్నారు.