ఏపీ మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. ఇద్దరు కొత్త వాళ్లు మంత్రులుగా ప్రమాణం చేశారు. రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పలాస ఎమ్మెల్యే అప్పలరాజు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వారితో బుధవారం(జూలై 22,2020) మధ్యాహ్నం 1.29 గంటలకు ప్రమాణం చేయించారు. విజయవాడ రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కరోనా కారణంగా కొద్దిమంది అతిథులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.
తొలి గెలుపుతోనే కేబినెట్ లోకి:
కాగా, కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే సీనియర్ మంత్రి ధర్మానకు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇస్తారనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే శాఖల్లో మార్పులు జరుగుతాయనే చర్చ నడుస్తోంది. పాత మంత్రులకు ఇచ్చిన శాఖల్ని వీరికే కేటాయిస్తారని తెలుస్తోంది. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామాలతో ఖాళీ అయిన రెండు మంత్రి పదవులను అదే సామాజికవర్గానికి(బీసీ) చెందిన వారితో సీఎం జగన్ భర్తీ చేశారు. కాగా, ఈ ఇద్దరూ ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి కేబినెట్ లో చోటు దక్కించుకోవడం విశేషం.
మంత్రి అయిన డాక్టర్:
శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు 1980లో వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ అనే మత్స్యకార గ్రామంలో జన్మించారు. విశాఖ జిల్లా సింహాచలంలోని ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి చదివారు. రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ రాష్ట్ర స్థాయి గోల్డ్ మెడల్ సాధించారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎండి(జనరల్ మెడిసిన్) చదివారు. కేజీహెచ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేశారు. 2007లో పలాస-కాశీబుగ్గలో ‘సేఫ్’ ఆస్పత్రి ఏర్పాటు చేసి ప్రజావైద్యునిగా గుర్తింపు పొందారు. 12 ఏళ్లు డాక్టర్గా సేవలు అందించారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి.. 2017 ఏప్రిల్లో వైఎస్సార్సీపీలో చేరారు. వెంటనే పార్టీ పలాస నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో తొలిసారి పలాస నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పలరాజు, శ్రీదేవి దంపతులకు అరవ్, అర్నవ్ అనే ఇద్దరు పిల్లలున్నారు. పదో తరగతిలో ప్రతిభా అవార్డును అప్పటి సీఎం చంద్రబాబు చేతులమీదుగా అందుకోవడం విశేషం.
వేణు పొలిటికల్ లైఫ్ అంతా అనూహ్యమే:
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రాజకీయ ఎదుగుదల అనూహ్యమనే చెప్పాలి. వ్యాపారం చేసుకునే ఈయనకు సామాజిక సమీకరణాల్లో భాగంగా 2001లో కాంగ్రెస్లో రాజోలు నుంచి(స్థానికేతరుడైనా) జడ్పీటీసీ సీటు లభించింది. 2006లో మలికిపురం నుంచి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2008 నుంచి 2012 వరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నారు. 2013లో వైఎస్సార్సీపీలో చేరి, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపికయ్యారు. 2014లో కాకినాడ రూరల్ నుంచి(స్థానికేతరుడైనా) వైసీపీ తరఫున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2019లో నియోజకవర్గం మారారు. రామచంద్రపురం నుంచి వైసీపీ టిక్కెట్ను అనూహ్యంగా దక్కించుకుని తోట త్రిమూర్తులుపై విజయం సాధించారు. ఇక్కడ నుంచి పోటీ చేయాల్సిన పిల్లి సుభాస్ చంద్రబోస్ వేరే నియోజకవర్గానికి మారగా, చెల్లుబోయినకు ఆ టికెట్ దక్కింది. ఇక, ఇప్పుడు బోస్ ఖాళీ చేసిన మంత్రి పీఠం వేణుకు దక్కడం గమనార్హం.