విజయవాడ : మీరు మా నేతలను లాక్కొంటే..చూస్తూ కూర్చొంటామా..మీ నేతలను కూడా లాక్కొంటాం..అనే పరిస్థితి ఏపీలో నెలకొంది. ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ – టీడీపీ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతున్నాయి. కీలక నేతలన ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు ఆయా పార్టీల అధినేతలు. కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి టీడీపీని వీడి జనవరి 22వ తేదీన జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీనికి ప్రతిగా టీడీపీ…వైఎస్ఆర్ కాంగ్రెస్కి చెందిన కీలక నేతపై గాలం వేసింది.
విజయసాయిరెడ్డి బామ్మర్థి ఝులక్ :
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈయన బావమరిది ద్వారకానాథ్ రెడ్డి. 1994 నుంచి 1999 వరకు లక్కిరెడ్డిపల్లె నియోజక వర్గంలో తెలుగు దేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా కొనసాగారు. ఈయన ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఝులక్ ఇచ్చారు. జనవరి 28వ తేదీ సోమవారం సీఎం చంద్రబాబుని కలిసేందుకు అమరావతికి వచ్చేశారు. ఈ పరిణామంతో జగన్ శిబిరంలో కలకలం రేపింది. ఆయన్ను పార్టీలో చేరిపించుకుని ఎన్నికల బరిలో నిలపాలని టీడీపీ యోచిస్తోంది. ఆయన చేరితే పార్టీలో మరింత బలం వస్తుందని బాబు అనుకుంటున్నారు. మొత్తంగా ఏపీ రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ x వికర్ష్ నడుస్తోంది. ఎప్పుడు ఎవరు హ్యాండ్ ఇస్తారో…తెలియని పరిస్థితి నెలకొని ఉంది.