ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది, రాజధాని వస్తుంది- వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. మీ జీవితాలను మార్చే ఆయుధం. ఐదేళ్లకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం.

YS Sharmila In Nagari

YS Sharmila : ఏపీ మంత్రి రోజా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ సభ నిర్వహించారు. ఏపీలో కాంగ్రెస్ ను గెలిపిస్తే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని, రాజధాని కూడా వస్తుందని వైఎస్ షర్మిల అన్నారు.

”ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. ఓటు మీ జీవితాలను మార్చే ఆయుధం. ఓటు ఐదేళ్లకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. అందుకే ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. మా కోసం ఎవరు నిలబడతారు, ఎవరు గెలిస్తే మాకు ప్రత్యేక హోదా వస్తుంది, ఎవరు గెలిస్తే మాకు పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది, ఎవరు గెలిస్తే మాకు రాజధాని వస్తుంది, ఎవరు గెలిస్తే మాకు మేలు జరుగుతుంది, మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, వ్యవసాయం మళ్లీ పండగ అవుతుంది, ఎవరు గెలిస్తే రుణమాఫీ జరుగుతుంది..

Also Read : వైసీపీకి గుబులు పుట్టిస్తున్న పలమనేరు ఎమ్మెల్యే.. అసలేం జరిగింది

ఇవన్నీ ఆలోచన చేసి ఓటు వేయండి. రాహుల్ గాంధీ ప్రధాని అయిన మొట్టమొదటి రోజే ఏపీకి చెందిన ప్రత్యేక హోదా ఫైల్ పై సంతకం పెడతానని చెప్పారు. మీరు కాంగ్రెస్ ను ఆశీర్వదించండి. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తుంది. పోలవరం వస్తుంది, రాజధాని వస్తుంది, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మన బిడ్డలకు మేలు జరుగుతుంది. మళ్లీ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన వస్తుంది. వైఎస్ఆర్ బిడ్డగా నేను మాటిస్తున్నా” అని షర్మిల అన్నారు.

Also Read : బీజేపీలో ఉంటూ టీడీపీ టికెట్ కోసం పోటీ? ధర్మవరం తెలుగుదేశం పార్టీలో తీవ్ర గందరగోళం

జగన్ ప్రభుత్వంపైనా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు షర్మిల. ” జగన్ పాలనలో వ్యవసాయం పరిస్థితి దారుణంగా ఉంది. అప్పు లేని రైతు ఒక్కరూ లేరు. మొత్తం అప్పుల పాలైపోయారు. రాజశేఖర్ రెడ్డి రైతులను నెత్తిన పెట్టుకున్నారు. మరి జగన్ ఏం చేశారు? రైతులకు మద్దతు ధర వచ్చేలా ఒక నిధి ఏర్పాటు చేస్తానని ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో జగన్ చెప్పారు. ఏడాదికి రూ.3వేల కోట్లు ఆ నిధికే కేటాయిస్తామన్నారు. కానీ, అధికారంలోకి వచ్చాక ఒక్క ఏడాది అయినా కేటాయించారా?

రూ.4వేల కోట్లతో రైతులకు నష్టపరిహారం (కరవు, వరదలు వచ్చినప్పుడు) ఇచ్చేలా మరో నిధి ఏర్పాటు చేస్తామన్నారు. మరి సీఎం అయ్యాక.. ఒక్క ఏడాది అయినా నష్ట పరిహారం ఇచ్చారా? ఒక్కసారైనా రూ.4వేల కోట్లు రైతుల కోసం పక్కన పెట్టారా? ఎన్నికలకు ముందు ఎన్ని మాటలు చెప్పారు? ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు? ఎన్నికలు అయిపోయాక అన్నీ మర్చిపోయారు. మరి మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు? మరి మీరా రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నిలబెట్టేది? అంటూ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు షర్మిల.

 

ట్రెండింగ్ వార్తలు