Margani Bharat Ram : అక్కడ.. జగన్ ఎవరిని నిలబెట్టినా గెలిపించే బాధ్యత నాదే- ఎంపీ భరత్
Margani Bharat Ram: ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అకౌంట్లలోకి నేరుగా రూ.2లక్షల కోట్లు జమ చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఎంపీ భరత్ అన్నారు.
- Naveen
- Published On : April 23, 2023 / 06:44 PM IST
Margani Bharat Ram
Margani Bharat Ram : రాజమండ్రి సిటీ ఇంఛార్జి విషయంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని ఎంపీ మార్గాని భరత్ చెప్పారు. అర్బన్ నుండి ఎవరిని నిలబెట్టినా వారిని గెలిపించే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను అని స్పష్టం చేశారు. టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై భరత్ విమర్శలు చేశారు. లోకేశ్ పాదయాత్ర దేనికీ ఉపయోగం లేదన్నారు. లోకేశ్ తో ఎవరైనా సెల్ఫీలు దిగుతున్నారా? అని ప్రశ్నించారు.
మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంటిపై చంద్రబాబు రాళ్ల దాడి చేయించడం దారుణం అన్నారు ఎంపీ భరత్. దళితుల ఓట్లు కావాలంటారు, మళ్లీ దళిత మంత్రి ఇళ్లపై దాడి చేయిస్తారు అని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. నాలుగేళ్ల పాటు నోరు మెదపని బీజేపీ.. ఇప్పుడు ఎన్నికల సమయంలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి వైసీపీపై బురద జల్లుతోందని మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజల నుండి స్పందన బాగుందన్నారు ఎంపీ భరత్. ప్రజల నుండి స్పందన బాగోలేకపోతే ప్రజల్లోకి ఎలా వెళ్తాం అని అడిగారు. సుమారు 8.5 కోట్ల రూపాయలతో రాజమండ్రిలో పూలే భవనానికి శంకుస్థాపన చేస్తున్నాం అని ఎంపీ భరత్ తెలిపారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల భూమిని చదును చేస్తే రైతుల ముసుగులో టీడీపీ నేతలు వచ్చి అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
Also Read..KA Paul : విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు రూ.42 కోట్లకు బిడ్ వేస్తా : కేఏ పాల్
జగన్ సీఎం అయిన నుండి నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అన్న రీతిలో పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అకౌంట్లలోకి నేరుగా రూ.2లక్షల కోట్లు జమ చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఎంపీ భరత్ అన్నారు. టైమ్స్ సర్వే ప్రకారం వైసీపీకి పార్లమెంట్ ఎంపీలు 25కి 25 వస్తాయని తేలిందన్నారు. అదే స్ఫూర్తితో అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్(175/175) చేసే దిశగా ముందుకెళ్తామన్నారు.
