Statue of Equality : హైదరాబాద్‌‌కు మోదీ.. తలసానికి బాధ్యతలు

ప్రధాని కార్యక్రమాలన్నింటిలో పాల్గొనడంతో పాటు ఆయన విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో వీడ్కోలు పలికే వరకూ కేసీఆర్‌ మోదీ వెంటే ఉంటారు.

Modi

Narendra Modi Visit Muchintal : రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మోదీ 2022, ఫిబ్రవరి 05వ తేదీ శనివారం మధ్యాహ్నం 2గంటల 10నిమిషాలకు హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌ అంతర్జాతీయ పరిశోధన సంస్థ స్వర్ణోత్సవాలు, ముచ్చింతల్‌లో రామానుజాచార్య విరాట్‌ విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. తొలుత శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్‌లో ఇక్రిశాట్‌కు వెళుతారు. అక్కడ కార్యక్రమం అనంతరం ముచ్చింతల్ కు చేరుకుంటారు.

Read More : Statue Of Equality : సహస్రాబ్ది సమారోహంలో కీలకఘట్టం.. యాగశాలలో విష్వక్సేనేష్టి

ప్రొటోకాల్‌ ప్రకారం ప్రధాని పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పర్యటనలో గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రులు తోమర్‌, కిషన్‌రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొంటారు. సమతా స్ఫూర్తి కేంద్రంలో ప్రధాని సుమారు మూడు గంటల సేపు పర్యటిస్తారు. ఈ సందర్భంగా కేంద్రం విశిష్టతలను చిన జీయర్‌స్వామి మోదీకి వివరించనున్నారు. రామానుజాచార్య విగ్రహం, యాగశాలలను ప్రధాని హెలికాప్టర్‌ ద్వారా విహంగ వీక్షణం చేసేలా ఏర్పాట్లు చేశారు. అటు మోదీ పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రధాని పర్యటనలో 8 వేల మందితో బందోబస్తు నిర్వహించనున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. శ్రీరామనగరానికి దారితీసే మార్గాలన్నింటినీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాని వెళ్లే పీ 1 రోడ్డులో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో తనిఖీలు చేశారు. ఎస్పీజీ డీఐజీ నవనీత్ కుమార్ సమతాస్ఫూర్తి కేంద్రాన్ని, యాగశాలలను పరిశీలించారు.