×
Ad

Sri Rama Navami : భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభం.. ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం

వైష్ణవ సంప్రదాయ ప్రకారం ఈ కార్యక్రమం జరిగింది. సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించిన మహిళలు, పురుషులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తయారు చేసిన పసుపుతో తలంబ్రాలు చేశారు. బేడా మండపం వద్ద

  • Published On : March 18, 2022 / 01:09 PM IST

Sriramanavami

Bhadrachalam : కొద్ది రోజుల్లో శ్రీరామనవమి పండుగ సమీపిస్తోంది. దీంతో రాముడి ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాలను సుందరంగా అలంకరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయంగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో 2022, మార్చి 18వ తేదీ శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. ఏప్రిల్ 10వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా నవమి ఉత్సవాల పనులను ప్రారంభించారు. ప్రధాన ఆలయంలో ఉన్న మూలమూర్తులు, ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. చిత్రకూట మండపంలో రోలు, రోకలికి దేవతలను ఆవహన చేసి పసుపు దంచే వేడుకను చేపట్టారు.

Read More : Sri Ramanavami : శ్రీరామనవమి ఇంట్లో ఎలా జరుపుకోవాలి?

వైష్ణవ సంప్రదాయ ప్రకారం ఈ కార్యక్రమం జరిగింది. సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించిన మహిళలు, పురుషులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తయారు చేసిన పసుపుతో తలంబ్రాలు చేశారు. బేడా మండపం వద్ద లక్ష్మణ సమేత సీతారాములకు డోలోత్సవం, వసంతోత్సవాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. గోటి తలంబ్రాలను అందించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరిస్తున్నారు. ఏప్రిల్ 09వ తేదీన సీతారాములకు ఎదుర్కోలు ఉత్సవం, 10వ తేదీన కల్యాణోత్సవం, 11న పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో శివాజీ వెల్లడించారు.

Read More : Bhadrachalam Temple: భద్రాద్రి రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ప్రతీ ఏటా భద్రాచలం, ఒంటిమిట్ట రామాలయాల్లో.. సీతారామ కల్యాణాలకు .. గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలు అందిస్తారు. ఇందుకోసం స్వయంగా రామ పంట పండించారు. దాదాపు 3 నెలలు శ్రమించి పంట పండించి.. 8వందల కేజీలు బియ్యంను గోటితో వలిచి .. కోటి తలంబ్రాలు తయారు చేశారు. ఈ కోటి తలంబ్రాల తయారీలో 60 గ్రామాల్లోని రామభక్తులు పాల్గొన్నారు. కోటి తలంబ్రాల కార్యక్రమం ప్రారంభం కావడంతో .. సీతమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలం సీతారామ కళ్యాణానికి 11 ఏళ్లుగా కోటి తలంబ్రాలు అందిస్తున్నారు. 6 ఏళ్ల నుంచి ఒంటిమిట్ట శ్రీరామనవమికీ కూడా కోటి తలంబ్రాలు అందిస్తున్నారు.

Read More : East Godavari : రామయ్య తండ్రికి..సిద్ధమౌతున్న గోటి తలంబ్రాలు

కరోనా వైరస్ కారణంగా భద్రాద్రి ఆలయంలో నిర్వహించే శ్రీరామ కల్యాణం భక్తులు లేకుండానే నిర్వహించే వారు. ప్రస్తుతం వైరస్ తగ్గుముఖం పడుతుండడంతో ఈసారి భక్తుల సమక్షంలో శ్రీరామ కల్యాణం నిర్వహించడం జరుగుతుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 02వ తేదీ ఉగాది పర్వదినం సందర్భంగా.. ప్రభుత్వ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించనున్నట్లు మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి తెలిపారు.