తిరుమలలో వైభవంగా శ్రీవారి పుష్పయాగం

  • Publish Date - November 21, 2020 / 07:29 PM IST

Srivari Puspayagam in Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే  పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని 15వ శతాబ్దం నుంచి ఆల‌యంలో పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు శాస‌నాల ద్వారా తెలుస్తోంద‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు.
పూర్వపురోజుల్లో బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం జరిగిన ఏడో రోజు స్వామికి పుష్పయాగం చేసేవారని చరిత్ర చెబుతోంద‌న్నారు. ఆ తరువాత నిలిచిపోయిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని 1980, నవంబరు 14న టిటిడి పునరుద్ధరించి ప్రతి ఏటా కార్తీక మాసం శ్రవణా నక్షత్ర పర్వదినాన నిర్వహిస్తోంద‌న్నారు.
శ్రీ‌వారి పుష్పయాగానికి మొత్తం 7 టన్నుల పుష్పాలు, పత్రాలను వినియోగిస్తున్నామన్నారు. ఇందులో సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా పుష్పార్చన నిర్వహించినట్లు ధర్మారెడ్డి చెప్పారు.
శ్రీ‌వారి ఆల‌యంలో పుష్పయాగం సంద‌ర్భంగా శ‌నివారం ఉద‌యం రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేశారు.
ఇందులో భాగంగా ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ‌ద్రవ్యాలతో స్వామివారికి విశేషంగా అభిషేకం చేశారు.
మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు వివిధ రకాల పూలు, పత్రాలతో స్వామి వారికి పుష్పార్చన చేశారు. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ ఉంటుంది. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీ మలయప్పస్వామి  వారు భక్తులకు దర్శనమిస్తారు.
పుష్పార్చన కోసం తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి 7 టన్నుల పూలను టీటీడీ సేకరించింది. భక్తులు విరాళంగా పంపిన ఈ పూలకు ముందుగా పూలమాలలు తయారు చేసే గదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పూల గంపలను ఊరేగింపుగా ఆలయానికి తరలించారు. పుష్పయాగాన్ని పురస్కరించుకొని ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని దేవస్ధానం రద్దుచేసింది.

ట్రెండింగ్ వార్తలు