Tirumala Brahmotsavam 2022 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
బ్రహ్మాండ నాయకుడు తిరుమల వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామి సర్వసేనాధిపతైన విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించడాన్ని అంకురార్పణం అంటారు.
- Naveen
- Published On : September 26, 2022 / 10:06 PM IST
Tirumala Brahmotsavam 2022 : బ్రహ్మాండ నాయకుడు తిరుమల వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామి సర్వసేనాధిపతైన విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించడాన్ని అంకురార్పణం అంటారు. విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల మధ్య ఊరేగింపుగా మాడవీధిలో ఉత్సవ ఏర్పాట్లను చూస్తూ తిరిగి ఆలయానికి చేరుకున్న తర్వాత యాగశాలలో శాస్త్రోక్త కార్యక్రమాలను నిర్వహించారు.
లలాట, బహు, సప్త పునీత ప్రదేశంలో భూమిపూజ జరిపారు. తొమ్మిది కుండల్లో శాలి, వ్రహి, యువ, ముద్గ, మాష, ప్రియంగు వంటి నవధాన్యాలను ఆ మట్టిలో కలిపి మొలకెత్తించే పనికి శ్రీకారం చుట్టారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ బీజవాపం కార్యక్రమంతో అంకురార్పణ కార్యక్రమం సమాప్తమైంది. క్రమం తప్పకుండా నీరు పోస్తూ పచ్చగా మొలకెత్తేలా అర్చకులు జాగ్రత్తగా చూసుకుంటారు. మంగళవారం సాయంత్రం జరిగే ధ్వజరోహణంతో గోవిందుడి బ్రహ్మోత్సవాల సంబరం మొదలుకానుంది.
