TTD Panchagavya Products : డిసెంబర్లో మార్కెట్లోకి టీటీడీ పంచగవ్య ఉత్పత్తులు

తిరుమల తిరుపతి దేవస్ధానముల ఆధ్వర్యంలో తయారు చేసే 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి మార్కెట్లోకి విడుదల చేసేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ

TTD Panchagavya Products : తిరుమల తిరుపతి దేవస్ధానముల ఆధ్వర్యంలో తయారు చేసే 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి మార్కెట్లోకి విడుదల చేసేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కే.ఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనం లోని తన చాంబర్లో ఈరోజు ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ, ఆయుష్ శాఖ నుంచి పంచగవ్య ఉత్పత్తులకు లైసెన్సులు పొందే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఈ లోపు ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించిన డిజైన్ లు కూడా సిద్ధం చేసుకోవాలని ఆయన చెప్పారు.

ముడి పదార్థాల సేకరణ, యంత్రాలను సిద్ధం చేసుకుని యంత్రాల ఏర్పాటుకు అవసరమయ్యే విద్యుత్, ఇంజనీరింగ్ పనులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కోయంబత్తూర్ కు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కుదిరిన ఒప్పందం మేరకు, సదరు సంస్థ 10 సంవత్సరాల పాటు ఆయుర్వేద ఉత్పత్తులు తయారుచేసి టీటీడీకి అందజేస్తుందని ఈవో వివరించారు.

ఫ్లోర్ క్లీనర్, సోపులు, షాంపూ, దంత మంజనం పౌడర్, ఆయుర్వేద అగరబత్తులు లాంటి ఉత్పత్తులు ఉంటాయని తెలిపారు. వీటిలో టీటీడీ వాడగా, మిగిలినవి విక్రయాలకు పెట్టేలా ఏర్పాట్లు చేయాలన్నారు. టీటీడీ ఆయుర్వేద ఫార్మసీ నుంచి 70 రకాల గో ఆధారిత ఉత్పత్తుల తయారీకి సంబంధించి ఆయుష్ వద్ద లైసెన్సులు పొందే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలన్నారు. ఆయుర్వేద ఫార్మసీ లో ఇప్పటికే 115 రకాల మందులు తయారు చేస్తున్నట్లు ఈవో చెప్పారు.
Also Read : Antarvedi Temple : నేటినుంచే..అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు
అనంతరం ఈవో గోసంరక్షణ శాల అధికారులతో మాట్లాడుతూ, తిరుపతిలోని గోశాల నుంచి భాకరాపేట, పలమనేరు లోని గోశాలలకు గోవుల తరలింపు ప్రక్రియ పది రోజుల్లో పూర్తి కావాలన్నారు. అలాగే పలమనేరు గోశాల నుంచి కొన్ని గోవులను తిరుపతి గోశాలకు తరలించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. గిర్ ఆవుల కొనుగోలు కోసం కమిటీ ఈనెలాఖరులోపు గుజరాత్ వెళ్లి గిర్ ఆవుల కొనుగోలుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలన్నారు. తిరుపతిలోని గోశాలలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ నిర్మాణానికి త్వరగా టెండర్లు పిలవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

ట్రెండింగ్ వార్తలు