AB De Villiers
AB De Villiers : భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇటీవల వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన విషయం విధితమే. వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో కోహ్లీ సెంచరీ చేయడం ద్వారా ఈ ఘనతను అందుకున్నాడు. సచిన్ 452వ ఇన్నింగ్స్ (463 మ్యాచ్) లో 49వ వన్డే సెంచరీ సాధిస్తే.. కోహ్లీ మాత్రం కేవలం 277వ ఇన్నింగ్స్ (289 మ్యాచ్)లోనే ఆ రికార్డు సమం చేశాడు. సచిన్ రికార్డును సమం చేయడంతో మాజీ, తాజా క్రికెటర్లు కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ సచిన్ రికార్డును సమం చేసిన కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏ జనరేషన్ ప్రకారం చూసుకున్నా విరాట్ కోహ్లీ చాలా వేగవంతంగా ఈ రికార్డును సాధించాడని కోహ్లీపై డివిలియర్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఓ యూట్యూబ్ ఛానెల్ డివిలియర్స్ మాట్లాడుతూ.. 277 ఇన్నింగ్స్ లలోనే కోహ్లీ 49 వన్డే సెంచరీలు చేయడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. కోహ్లీ, నేను చాలా సన్నిహితులం.. ఒక విధంగా చెప్పాలంటే మేమిద్దరం అన్నదమ్ములం అంటూ వారిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని డిలివియర్స్ చెప్పుకొచ్చాడు. సచిన్ తో పోల్చితే కోహ్లీ చాలా స్పీడ్ గా ఈ ఫీట్ సాధించాడు.
అయితే, ఈ ఆటకూడా ప్రస్తుతం చాలా మారిపోయింది. సచిన్ టైంతో పోలిస్తే ఇప్పుడు ఆటలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. అప్పట్లో మంచి పిచ్ పై 250 చేయడం అంటే గొప్పగా ఉండేది. కానీ, ఇప్పుడు స్కోర్ 400 దాటుతుందని డివిలియర్స్ పేర్కొన్నాడు. ఇదిలాఉంటే విరాట్ కోహ్లీ, డిలివియర్స్ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆడారు. వీరిద్దరు మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.