Ravindra Jadeja : రవీంద్ర జడేజా వన్డే కెరీర్ ఇక ముగిసినట్లేనా..! అజిత్ అగార్కర్ కామెంట్స్ వైరల్..
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో రవీంద్ర జడేజాకు (Ravindra Jadeja) చోటు దక్కలేదు.
- Thota Vamshi Kumar
- Published On : October 4, 2025 / 04:54 PM IST
Ajit Agarkar Opens Up On Snubbing Jadeja From India ODI Squad For Australia Tour
Ravindra Jadeja : అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించారు. అతడి స్థానంలో శుభ్మన్ గిల్కు బాధ్యతలను అప్పగించారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే.. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు మాత్రం వన్డే జట్టులో చోటు దక్కలేదు.
దీంతో వన్డేల్లో 36 ఏళ్ల రవీంద్ర జడేజా కెరీర్ ఇక ముగిసినట్లేననే వార్తలు వస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ 2024 విజయం అనంతరం పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన జడ్డూ ప్రస్తుతం వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే.
Ajit Agarkar : అందుకే రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించాం.. అజిత్ అగార్కర్ కామెంట్స్..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన జడేజాను ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు తప్పించడం పై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. శనివారం జట్టు వివరాలను వెల్లడించిన తరువాత అగార్కర్ మీడియాతో మాట్లాడాడు. జట్టు వ్యూహాత్మక నిర్ణయంలో భాగంగానే జడేజాకు చోటు దక్కలేదన్నాడు. అతడి ఫామ్ పై ఎలాంటి సందేహం లేదన్నాడు.
ఆసీస్ పర్యటనలో ముగ్గురు స్పిన్నర్ల అవసరం ఉండదని, ఇప్పటికే కుల్దీప్, వాషింగ్టన్లు జట్టులో ఉండడంతో మూడో స్పిన్నర్ అవసరం లేదన్నాడు. ‘ఆసీస్ పర్యటనకు ఇద్దరు ఎడమచేతి వాటం స్పిన్నర్లకు తీసుకువెళ్లడం సాధ్యం కాదు. జడేజా ఎంతటి ప్రతిభావంతుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడు పోటీలోనే ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోనూ అతడు ఉన్నాడు. అక్కడి పరిస్థితుల దృష్ట్యా మేం ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లాం.’ అని అగార్కర్ అన్నాడు.
ఆసీస్తో పిచ్ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే ఇద్దరు ఎడమచేతి వాటం స్పిన్నర్లు అవసరం లేదు. వాషింగ్టన్, కుల్దీప్ యాదవ్లతో జట్టు సమతుల్యతను కాపాడుకోగలం. అని అగార్కర్ తెలిపాడు. బ్యాటర్, బౌలర్గానే కాకుండా ఫీల్డర్గానూ జడేజా అత్యుత్తమ ఆటగాడే అయినప్పటికి కూడా కొన్ని కొన్ని సార్లు ఇలా జరుగుతుందన్నాడు. ఇది మూడు మ్యాచ్ల చిన్న సిరీస్ అని అందరికి అవకాశాలు రావు అని చెప్పుకొచ్చాడు. దురదృష్టవశాత్తు ఈ సారి జడేజాకు ఛాన్స్ రాలేదని, అంతకు మించి ఇంకా ఏమీ లేదని, అతడు ఎప్పుడు తమ ప్రణాళికల్లోనే ఉంటాడని చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియా పర్యటనకు భారత వన్డే జట్టు ఇదే..
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.
