Asian Games 2023 Teamindia: ఆసియా క్రీడల్లో టీమిండియా టైటిల్ పోరుకు సిద్ధమైంది. హాంగ్జౌ వేదికగా శుక్రవారం జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. చిన్న టార్గెట్ ను వికెట్ నష్టపోయి 9.2 ఓవర్లలోనే ఛేదించి విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా రాణించడంతో టీమిండియా సునాయాసంగా విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించింది.
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 96 పరుగులు మాత్రమే చేసింది. పర్వేజ్ హొస్సేన్ ఎమోన్(23), జాకర్ అలీ (24), రకీబుల్ హసన్(14) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఇద్దరు డకౌట్ అయ్యారు. భారత బౌలర్లలో సాయి కిశోర్ 3, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు పడగొట్టారు. అర్షదీప్ సింగ్, తిలక్ వర్మ, రవి బిష్ణోయ్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు.
చెలరేగిన తిలక్ వర్మ
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ప్రారంభంలోనే భారీ షాక్ తగిలింది. యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ 4 బంతులను ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. అయితే రుతురాజ్, తిలక్ వర్మ చెలరేగి ఆడటంతో భారత్ అలవోకగా విజయాన్ని అందుకుంది. రుతురాజ్ 26 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 26 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 55 పరుగులు బాదాడు.
Also Read: రచిన్ రవీంద్ర ఎవరు..? సచిన్, రాహుల్ ద్రవిడ్లతో ఉన్న సంబంధం ఏంటి..?