IND vs AUS 3rd T20
సిరీస్లో నిలబడాలి అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. గౌహతి వేదికగా జరిగినన మూడో టీ20 మ్యాచులో ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో భారత ఆధిక్యాన్ని 2-1 కి తగ్గించింది. ఆల్ రౌండర్ గ్లెన్మాక్స్వెల్ (104 నాటౌట్; 48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకం బాదడంతో 223 పరుగుల లక్ష్యాన్ని సరిగ్గా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మిగిలిన వారిలో ట్రావిస్ హెడ్ (35; 18 బంతుల్లో 8 ఫోర్లు), మాథ్యూవేడ్ (28 నాటౌట్) లు రాణించారు. భారత బౌలర్లలో రవిబిష్ణోయ్ రెండు వికెట్లు తీశాడు. అవేష్ ఖాన్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (123నాటౌట్; 57 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ (39; 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (31నాటౌట్; 24 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. ఆసీస్ బౌలర్లలో జాసన్ బెహ్రెన్డార్ఫ్, కేన్ రిచర్డ్సన్, ఆరోన్ హార్డీ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ ఆరంభంలోనే రెండు షాకులు తగిలాయి. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (6)తో పాటు వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (0) విఫలం కావడంతో 24 పరుగులకే టీమ్ఇండియా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈదశలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్తో జత కలిసిన సూర్యకుమార్ యాదవ్ను జట్టును ఆదుకున్నాడు. రుతురాజ్ నిదానంగా ఆడగా సూర్య మాత్రం బౌండరీలతో స్కోరు వేగాన్ని పెంచాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని సూర్యను ఔట్ చేయడం ద్వారా ఆరోన్ హార్డీ విడగొట్టాడు. సూర్య, రుతురాజ్లు మూడో వికెట్కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
సూపర్ సెంచరీ..
Dog Attacks Bowler : బౌలర్ వెంట పడిన కుక్క.. ఆ తరువాత ఏం జరిగిందంటే..? వీడియో
Dog Attacks Bowler : బౌలర్ వెంట పడిన కుక్క.. ఆ తరువాత ఏం జరిగిందంటే..? వీడియో
సూర్యకుమార్ ఔటైన తరువాత రుతురాజ్ గైక్వాడ్ గేరు మార్చాడు. బౌండరీలతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 32 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత మరో 20 బంతుల్లో ఇంకో 50 పరుగులను సాధించాడు అంటే అతడు ఎంత విధ్వంసం సృష్టించాడో అర్ధం చేసుకోవచ్చు. మొత్తంగా రుతురాజ్ 52 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో అతడికి ఇదే తొలి సెంచరీ. రుతురాజ్ ధాటికి 18వ ఓవర్లో హార్డీ 25 పరుగులు, ఆఖరి ఓవర్లో మాక్స్వెల్ 30 పరుగులు సమర్పించుకున్నాడు. మరోవైపు తిలక్ వర్మ సైతం ధాటిగా ఆడడంతో భారత్ భారీ స్కోరు చేసింది.