Badminton Star Ashwini Ponnappa Refutes Olympics Funding Report
పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిసింది. భారత్కు 6 పతకాలు వచ్చాయి. అందులో ఓ రజతం కాగా మరో 5 స్వర్ణాలు. కొన్ని విభాగాల్లో అథ్లెట్లు తృటిలో పతకాలను కోల్పోయారు. అయితే.. పారిస్ ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ ప్లేయర్లు ఖచ్చితంగా పతకం తెస్తారని చాలా మంది భావించారు. అయితే.. షటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఇక ఒలింపిక్స్ సన్నద్దమయ్యే క్రమంలో మహిళల డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్ప- తనీషా క్రాస్టోకు రూ. 1.5 కోట్లు ఖర్చు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
దీనిపై సోషల్ మీడియా వేదికగా స్టార్ షట్లర్ అశ్విని పొన్నప్ప స్పందించింది. తమకు ఎలాంటి నిధులు అందలేదని స్పష్టం చేసింది. వాస్తవాలను తెలుసుకోకుండా వార్తలను ఎలా రాస్తారని మండిపడింది. శిక్షణ నిధుల కోసం ఏ సంస్థ లేదా టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో తాను భాగం కాలేదంది. గతేడాది నవంబర్ వరకు టోర్నమెంట్ల కోసం సొంతంగా నిధులు సమకూర్చుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఆ తరువాత సెలక్షన్లలో ఎంపిక కావడంతో టోర్నీలకు పంపిచారంది.
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్స్ పూర్తి అయిన తరువాతే తనను టాప్(టార్గెట్ ఒలింపిక్ పోడియం)లో భాగం చేసినట్లుగా వివరించింది. అది కూడా గేమ్స్ పూర్తి అయ్యే వరకు మాత్రమే. ఏ సపోర్ట్ ఆర్గనైజేషన్ నుంచి గానీ, సీఎస్ఆర్ డెవలప్మెంట్ గ్రూప్ల నుంచి గానీ డబ్బులు తీసుకోలేదని, డబుల్స్ జట్టులో భాగమైన కోచ్ను పంపించమని మాత్రమే కోరామని, దాన్ని కూడా తిరస్కరించారంది.
13 జాతీయ శిక్షణ శిబిరాలు, 81 విదేశీ పర్యటనలకు టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం కింద కేంద్రం నిధులు సమకూర్చినట్లు పీటీఐ ఓ కథనాన్ని ప్రచురించింది. పారిస్ సన్నాహాల కోసం భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) మిషన్ ఒలింపిక్స్ సెల్ 16 క్రీడల కోసం రూ.470 కోట్లు కేటాయించినట్లు అందులో పేర్కొంది. బ్యాడ్మింటన్కు రూ.72.03 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. పీవీ సింధు శిక్షణకు రూ.3.13 కోట్లు, డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్ప- తనీషా క్రాస్టో రూ.1.5 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. దీనిపైనే అశ్విని ఘాటుగా స్పందించింది.
PCB : టెస్టు క్రికెట్ ఎంట్రీ టికెట్ రూ.15 మాత్రమే.. పాక్ ఆటగాళ్లకు ఆ మాత్రం కూడా ఎక్కువేనా..?