Bangladesh captain Najmul Shanto comments after 7 wicket loss to India
పాకిస్థాన్ పై చారిత్రాత్మక విజయాన్ని సాధించి భారత గడ్డపై అడుగుపెట్టిన బంగ్లాదేశ్కు వరుస షాకులు తగులుతున్నాయి. టెస్టు సిరీస్ను 0-2 తేడాతో కోల్పోయిన బంగ్లాదేశ్ తాజాగా తొలి టీ20 మ్యాచులోనూ ఘోర పరాజయం చవిచూసింది. మొదటి టీ20 మ్యాచులో ఓటమి అనంతరం బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ షాంటో మాట్లాడుతూ మరోసారి బ్యాటింగ్ వైఫల్యంతోనే భారీ మూల్యం చెల్లించుకున్నామని చెప్పాడు. పోరాడే స్కోరు లేకుంటే బౌలర్లు కూడా ఏమీ చేయలేరని పేర్కొన్నాడు.
పాజిటివ్ క్రికెట్ ఆడాలనే ప్రణాళికలతో బరిలోకి దిగినట్లు వెల్లడించాడు. అయితే సరైన ఆరంభం దక్కలేదన్నాడు. పొట్టి ఫార్మాట్లో మొదటి 6 ఓవర్లు ఎంతో ముఖ్యమైనవన్నాడు. పవర్ ప్లేలో విఫలం కావడం తమ కొంప ముంచిందని చెప్పుకొచ్చాడు. తాను ఏ ఒక్క ఆటగాడిని నిందించడం లేదని, మొత్తంగా బ్యాటింగ్ యూనిట్గా ఫెయిల్ అయినట్లు తెలిపాడు.
IND vs BAN T20: వావ్.. హార్దిక్ పాండ్యా ఎంత తేలిగ్గా సిక్స్ కొట్టాడో చూశారా.. వీడియో వైరల్
టీ20ల్లో దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉందని, అయితే.. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడడం కూడా ఎంతో ముఖ్యమన్నాడు. ఆటగాళ్లు స్ట్రైక్ రొటేట్ చేయడం పై కూడా దృష్టి పెట్టాలని సూచించాడు. వికెట్లు చేతిలో ఉంటే భారీ స్కోర్లు చేయొచ్చునని అభిప్రాయపడ్డాడు. ఈ పిచ్ పై సులువుగా 180 పరుగులు చేయొచ్చునని అభిప్రాయపడ్డాడు. బౌలింగ్లో రిషద్, ముస్తాఫిజుర్ రాణించారని, అయితే.. స్కోరు బోర్డుపై తగినన్ని పరుగులు లేకపోవడంతో వారి పోరాటం వృథా అయిందన్నాడు. తమ తప్పులను సరిదిద్దుకుని రెండో టీ20 మ్యాచులో మెరుగైన ప్రదర్శన చేస్తామని చెప్పాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో మెహిదీ హసన్ మిరాజ్ (35), నజ్ముల్ హోస్సేన్ షాంటో (27) లు ఫర్వాలేదనిపించగా మిగిలిన వారు విఫలం కావడంతో బంగ్లా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిలు చెరో మూడు వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
IND vs BAN: వారిపై ఫిర్యాదులు చేయను..! బంగ్లాతో మ్యాచ్ తరువాత వరుణ్ చక్రవర్తి ఎమోషనల్ స్పీచ్..